Sunil Mittal on Telecom | దేశీయంగా సేవలందిస్తున్న టెలికం సంస్థలు కలుస్తాయా.. ఉమ్మడి కార్యాచరణ చేపట్టబోతున్నాయా.. అవును.. భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యలు దాన్ని ధృవీకరిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న టెలికం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వందశాతం ఎఫ్డీఐలను అనుమతిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.
కేంద్రం సంస్కరణలు ప్రకటించిన నేపథ్యంలో టెలికం సంస్థలు కలిసి పని చేసేందుకు గల అవకాశాలపై ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్.. వొడాఫోన్ ఐడియా సీఈవో నిక్ రీడ్తో చర్చించినట్లు చెప్పారు. అలాగే రిలయన్స్ జియోపై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతోనూ మాట్లాడానని తెలిపారు. ఇండియన్ టెలికం రంగ కలలను సాకారం చేయాలంటే ఇండస్ట్రీ ఉమ్మడిగా పని చేయాలన్నారు.
టెలికం సేవలందించడంలో దేశీయ టెలికం సంస్థల మౌలిక వసతులను పరస్పర సహకార ధోరణితో సంస్థలు ఉపయోగించుకోవాలని సూచించారు. దీనివల్ల టెలికం సంస్థలపై ఖర్చుల భారం తగ్గుతుందన్నారు. అదే సమయంలో టెలికం సంస్థల మధ్య కార్టెలైజేషన్ ఉండబోదని సునీల్ మిట్టల్ స్పష్టం చేశారు.
రిలయన్స్ జియో తీసుకొస్తున్న అత్యంత చౌక స్మార్ట్ ఫోన్కు పోటీగా హ్యాండ్సెట్ మేకర్ల (మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు)తో ఎయిర్టెల్ ఒప్పందాలు కుదుర్చుకుంటుందని వార్తలొచ్చాయి. దీనిపై సునీల్ మిట్టల్ మాట్లాడుతూ.. ఆ అవసరం తలెత్తితే చౌక స్మార్ట్ఫోన్ తీసుకొచ్చేందుకు ఎయిర్టెల్ సిద్ధంగా ఉందన్నారు.
టెలికం రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు టెలికం సేవల ప్రొవైడర్లు చేతులు కలుపాల్సి ఉంటుందని మీడియా సమావేశంలో చెప్పారు. ఈ సహకార ధోరణి వల్ల టెలికం రంగంలో పోటీ తత్వం నెలకొంటుందన్నారు. మార్కెట్ పంపిణీపై ఆరోగ్యకరమైన చర్చలు జరిగాయని, టారిఫ్లపై కాదని అన్నారు. వొడాఫోన్ ఐడియా సీఈవో నిక్రీడ్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో జరిగిన చర్చల్లో టెలికం రంగ సహకారం.. ఇతర మౌలిక వసతుల రంగాలకు రోల్మోడల్గా ఉంటుందని చెప్పానని మిట్టల్ వెల్లడించారు.