Vijay | తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రముఖ దర్శకుడు, నటుడు సుందర్ సి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. ఆయన మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుందర్ సి తన రాజకీయ ప్రయాణంపై స్పందించారు. మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న తాను, ఇప్పుడు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ రెండు పెద్ద పార్టీల మధ్యే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పోటీ తీవ్రంగా ఉండబోతోందని చెప్పారు.ఇక నటుడు విజయ్ స్థాపించిన పార్టీపై ప్రశ్నించగా సుందర్ సి ఆసక్తికరంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ విజయ్ విషయంలో తాను అలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు. విజయ్ మా కుటుంబ సభ్యుడిలాంటి వాడు. నా భార్య ఖుష్బూ ఆయన్ని తమ్ముడిగా భావిస్తుంది. ఆయన కూడా ఆమెను అక్కగా పిలుస్తాడు. మా మధ్య ఉన్న ఈ బంధం వల్ల ఆయనను గానీ, ఆయన పార్టీని గానీ నేను విమర్శించను అని తెలిపారు.
మదురై అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించిన ఆయన, గెలిస్తే ప్రతి నెలా కొంతకాలం నియోజకవర్గంలోనే ఉండి ప్రజలతో మమేకమవుతానన్నారు. ఎన్నికల ఫలితాలే తన తదుపరి రాజకీయ అడుగులను నిర్ణయిస్తాయని చెప్పారు. మరోవైపు విజయ్ తన పార్టీతో ప్రజల్లోకి వెళ్లేందుకు భారీ సభలు నిర్వహిస్తున్నాడు. అయితే ర్యాలీలకు అనుమతుల సమస్యలు, కొన్ని ఘటనలు, కేసులు వంటి ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి.మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రముఖుల ఎంట్రీతో పోటీ మరింత ఉత్కంఠగా మారింది. రాబోయే ఎన్నికల్లో ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.