న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలోని అన్ని వాహనాలకు ఉమ్మడి ఫార్మాట్ (common format)తో కూడిన పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతోపాటు పీయూసీ డేటాబేస్ను జాతీయ రిజిస్టర్తో అనుసంధానం చేసింది.
ఇందుకోసం 1989 నాటికి జాతీయ మోటార్ వెహికల్ రూల్స్ను సవరించింది. ఉమ్మడి ఫార్మాట్తో కూడిన పీయూసీ సర్టిఫికెట్ కోసం ఈ నెల 14న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఒకే పీయూసీ సర్టిఫికెట్తోపాటు.. దానిపై వాహన యజమాని మొబైల్ నంబర్, పేరు, అడ్రస్, ఇంజిన్ నంబర్, చాసిస్ నంబర్ (చివరి నాలుగు నంబర్లు మాత్రమే కనిపించేలా) ముద్రిస్తారు. అంతేకాక, పీయూసీ సర్టిఫికెట్ పొందడానికి వాహన యజమాని మొబైల్ నంబర్ కూడా తప్పనిసరి చేసింది.
పీయూసీ సర్టిఫికెట్ వ్యాలిడేషన్, ఫీజు వివరాలను వాహన యజమానికి మెసేజ్ రూపంలో తెలిపేందుకు మొబైన్ నంబర్ తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నది. కాలుష్య నియంత్రణకు తొలిసారి రిజెక్షన్ స్లిప్నూ ప్రవేశపెట్టింది.
ఈ విధానం నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ కర్బన ఉద్గారాలు విడుదల చేసే వాహనాలకు రిజెక్షన్ స్లిప్ ఇస్తారు. అప్పుడు వాహన యజమాని తన వాహనాన్ని గుర్తింపు పొందిన పీయూసీ టెస్టింగ్ సెంటర్లకు తీసుకెళ్లాలి.
ఒకవేళ వాహన యజమాని టెస్టింగ్ సెంటర్కు తీసుకెళ్లకపోయినా.. వాహనం టెస్ట్లో ఫెయిల్ అయినా జరిమానా విధిస్తారు. అంతేకాక నిర్దేశిత ప్రమాణాలతో పీయూసీ సర్టిఫికెట్ పొందేవరకు వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.