Minister Sridhar Babu | హైదరాబాద్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 67 వేల మంది స్వయం సహాయక బృందాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ మహిళల కోసం ప్రతి శాసన సభ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 119 ప్రత్యేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్వయం సహాయక బృందాల ఉత్పత్తులు దేశవ్యాప్తంగా సరఫరా కావడంతో కొన్ని విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయన్నారు.
హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మూడు వారాల శిక్షణ ముగించుకున్న ఈజిప్టు ‘వాణిజ్య దౌత్యవేత్తల’ బృందంతో సోమవారం మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈజిప్టుతో వాణిజ్య సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు తమ ప్రభుత్వం ఆసక్తితో ఉందన్నారు.
ఔషధ ఎగుమతుల్లో రాష్ట్రం ప్రంపంచంలోని అనేక దేశాలతో పోటీ పడే స్థాయికి చేరుకున్నదని, రాష్ట్రం మొత్తం ఎగుమతులు రూ.1,16,182 కోట్లు కాగా ఇందులో రూ.36,893 కోట్లు ఫార్మా ఎగుమతులేనని ఆయన తెలిపారు.