Minister Ponguleti | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): స్థిరాస్తి రంగం బాగుంటేనే రాష్ట్ర అభివృద్ధి జోరుగా సాగుతుందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ క్రెడాయ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్ వేదికగా 13వ ఎడిషన్ ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పా రు.
రిజిస్ట్రేషన్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట నిజమేనని, ఈ విషయంలో బిల్డర్లు తమ అనుభవాలను సలహాలు, సూచనల రూపంలో ఇస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని 360 డిగ్రీలలో అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మూసీ సుందరీకరణ, ఎలివేటెడ్ కారిడార్, పాతబస్తీలో మెట్రో విస్తరణతోపాటు రాబో యే రోజుల్లో హైదరాబాద్లో తాగునీటి సరఫరాను మరింత పెంచుతామని తెలిపారు.
ఇన్నర్ రింగు, ఔటర్ రింగు, రీజినల్ రింగు రోడ్డులకు అనుసంధానంగా రేడియల్ రోడ్లు, లింకు రోడ్లు, అప్రోచ్ రోడ్లతో రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తమది ఫ్రెండ్లీ సర్కార్ అని, రియల్టర్లు అని, వ్యాపారులు అని వేర్వేరుగా చూడబోమని అన్నారు. ధరణిలో పెండింగ్లో దాదాపు తొమ్మిది లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, రెవెన్యూ లొసుగులను తొలగించి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్ర ప్రగతికి నిర్మాణ రంగం వెన్నెముకలా పనిచేస్తున్నదని, ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలని ఆశిస్తున్నామని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు వీ రాజశేఖర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం తీసుకునే పాలసీలో బిల్టర్ల తరపున సలహాలు, సూచనలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రాపర్టీలో రెరా అనుమతించిన 100కు పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి, ఐసీబీసీ చైర్మన్ శేఖర్రెడ్డి, క్రెడాయ్ ప్రతినిధులు గుమ్మి రాంరెడ్డి, రామకృష్ణారావు, జైదీప్రెడ్డి, జగన్నాథరావు, కొత్తపల్లి రాంబాబు, బీ ప్రదీప్రెడ్డి, మురళీమోహన్, శ్రీకాంత్, మనోజ్కుమార్ అగర్వాల్, క్రాంతికిరణ్రెడ్డి, టీడీఏ అధ్యక్షుడు జీవీ రావు తదితరులు పాల్గొన్నారు.