హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని, అందుకు నిదర్శనం ఐటీ ఎగుమతులతో పాటు, ఉద్యోగావకాశాల కల్పనే కారణమని, గతేడాది దేశ వ్యాప్తంగా 4.5 లక్షల ఐటీ ఉద్యోగావకాశాలు వస్తే, అందులో 1.50 లక్షల ఐటీ నియామకాలు తెలంగాణలోనే జరిగాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. బుధవారం హెచ్ఐసీసీలో జరిగిన హైసియా వార్షిక అవార్డుల సదస్సు ముగింపు కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిజిటల్ ప్యూచర్ సెంటర్ చైర్మన్, మాజీ కేంద్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్కు హైసియా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 8 ఏండ్లుగా ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభు త్వం కృషి చేస్తున్నదని, ఫలితంగానే ఐటీ ఎగుమతులు రెట్టింపు అవ్వడంతో పాటు అదే స్థాయిలో ఉద్యోగావకాశాలు వస్తున్నాయన్నారు.
‘ఈ రోజే అమెరికాకు చెందిన కంపెనీ ప్రొవిడెన్స్ హెల్త్ సిస్టం ప్రెసిడెంట్, సీఈవో రాడ్ హోచ్మన్, సీఐవో బీజే మూర్లు తమ ఉద్యోగుల సంఖ్య మూడు రెట్లు పెంచుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారని కేటీఆర్ తెలిపారు. సైయెంట్ వ్యవస్థాపకుడు చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఐటీలో భవిష్యత్ అంతా ఏఐ తోనే ఉంటుందన్నారు. ఐటీ నిపుణులు నిరంతరం కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటూనే ఉండాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైసియా అధ్యక్షురాలు మనీషా సాబు, హైసియా ప్రతినిధులు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.