Minister KTR | హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): తొమ్మిదన్నరేండ్ల పాలనలో రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, మరెంతో అభివృద్ధి చేయాల్సి ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చెందుతున్నట్టే తమ అభివృద్ధి వెర్షన్ కూడా అప్డేట్తో సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ‘తెలంగాణ 3.0 వెర్షన్’ డెవలప్మెంట్కు ఐకాన్గా నిలుస్తుందని తెలిపారు. శుక్రవారం బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) సదస్సుకు ఆయన ముఖ్య అథిగా హారయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మూడో సారి అధికారంలోకి వచ్చాక ఐదు రంగాల్లో అనూహ్యమైన ప్రగతిని సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, వాటిలో పర్యాటకం, క్రీడల మౌలిక సదుపాయాలు, విద్య-నైపుణ్యం, ఆరోగ్య, ఐటీ-ఆంత్రప్రెన్యూర్షిప్ విభాగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వివరించారు. రాష్ట్రంలో సకల జనుల సంక్షేమాన్ని కొనసాగిస్తూ, చేయాల్సిన మంచి పనులపై సమర్థ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామని, ఈ అభివృద్ధి దేశ, విదేశాల్లో ఉన్న ప్రముఖ సెలబ్రిటీలకు అర్థమవుతుంటే, స్థానిక ప్రతిపక్ష నేతలకు మాత్రం అర్థం కావడం లేదని విమర్శించారు.
రాష్ట్రమంతా సామాజిక మౌలిక సదుపాయాలపై దృష్టి సారించామని కేటీఆర్ చెప్పారు. ముఖ్యంగా పర్యాటక శాఖకు పెద్దపీట వేయాలనుకుంటున్నామని అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ అవకాశం ఇస్తే, ఆయనను బతిమాలైనా వచ్చే ఐదేండ్లు పర్యాటకశాఖ మంత్రిగా ఉంటానని తెలిపారు. ఈ రంగంలోని అవకాశాలను మరింత విస్తృతం చేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా కొత్త రిజర్వాయర్లు కనిస్తున్నాయని, వాటి పరిసరాల్లో చాలా ఉపాధి అవకాశాలున్నాయని అన్నారు.
తెలంగాణలో మెడికల్ టూరిజం, ఆధ్యాత్మిక టూరిజం, హెల్త్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం వంటివాటిల్లో ఎన్నో అవకాలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ నిధులు అవసరం లేకుండానే పీపీపీ పద్ధతిలో మరింత అభివృద్ధి చేసుకోవచ్చని వెల్లడించారు. రాష్ట్రంలోని ఆంత్రప్రెన్యూర్స్ ఈ రంగంపై దృష్టిసారించాలని కోరారు. ప్రస్తుత రాష్ట్ర అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, మున్ముందు అభివృద్ధి రుచి మరింత చూపిస్తామని తెలిపారు. హైదరాబాద్ను థియేటర్ డిస్ట్రిక్ట్గా చేస్తామని, ఇలాంటి ప్రణాళికలను అర్బన్ ప్రాంతాల్లో కూడా అమలు చేస్తామని వివరించారు.
పారిశ్రామిక రంగంలో దూసుకెళ్లేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నదని, కొత్తగా వచ్చే ఆంత్రప్రెన్యూర్స్కు తెలంగాణ అడ్డాగా మారనున్నదని కేటీఆర్ చెప్పారు. టీహబ్, వీహబ్, టీవర్క్స్, టాస్క్, టీఎస్ఐసీ, రిచ్ వంటి వ్యవస్థల ద్వారా ఎంతోమందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని, నేటికీ వారికి ఫండింగ్, లోన్స్ ఇస్తున్నామని వెల్లడించారు. వీహబ్ ద్వారా ఎంతోమంది మహిళలు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారని వివరించారు. దళిత వ్యాపారవేత్తల కోసం డిక్కీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. టీహబ్కు చెందిన ఓ కంపెనీ భారత్ నుంచి ప్రైవేట్గా అంతరిక్షంలోకి రాకెట్ పంపి చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో మహావీర్ సౌండ్రూమ్ ఫౌండర్ జలీల్ సబీర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనాషా, బీఎన్ఐ సభ్యులు పాల్గొన్నారు.
కరోనా మినహా తమకు దొరికిన ఆరున్నరేండ్లలో 5 విప్లవాలను సాధించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండించి హరిత విప్లవం సాధించామ ని చెప్పారు. ఫిషరీస్కు తెలంగాణ అడ్డాగా మారిందని, 46 వేల చెరువులు, నీటి వసతులు ద్వారా టన్నుల కొద్దీ చేపలను ఎగుమతి చేసేస్థాయికి తెలంగాణ ఎదిగిందని, తద్వారా నీలి విప్లవం సాధించామని వెల్లడించారు. మాంసం ఉత్పత్తిలో దేశంలోనే ఉత్తమ స్థానంలో ఉన్నామని, తద్వారా గులాబీ విప్లవం సాధ్యమైందని వివరించారు. రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకాల ద్వారా శ్వేత విప్లవం సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రం ఆయిల్పామ్కు అడ్డాగా మారనున్నది, తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండిస్తున్నామని తద్వారా పసుపు విప్లవం సాధ్యమైందని వెల్లడించారు. ఈ ఐదు విప్లవాలను ఆధారం చేసుకొని ఎన్నో స్టార్టప్లు వచ్చాయని, వాటి ద్వారా ఎందరికో ఉపాధి దొరికిందని పేర్కొన్నారు.