న్యూఢిల్లీ, డిసెంబర్ 22: విండో స్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)కు మద్దతును ఆపేసే దిశగా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అడుగులేస్తున్నది. ఇదిప్పుడు కోట్లాది వ్యక్తిగత కంప్యూటర్ల (పీసీలు) వినియోగదారులకు గుబులు పుట్టిస్తున్నది. విండోస్ 10 ఓఎస్ సేవలు నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా దానిపైనే ఆధారపడి నడుస్తున్న దాదాపు 24 కోట్ల పీసీలు చెత్తకుప్పల్లోకి చేరనున్నాయి మరి. అవును.. 2025 అక్టోబర్ వరకే విండోస్ 10కు మద్దతివ్వాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. ఇదే జరిగితే ఈ ఓఎస్ ఆధారిత డివైజ్లు ఒక్కసారిగా నిరుపయోగంగా మారిపోనున్నాయి. మరో అప్డేట్ వెర్షన్ ఉన్న పర్సనల్ కంప్యూటర్లను అంతా కొనుక్కోవాల్సిందే. దీంతో పాత కంప్యూటర్లు ఈ-వేస్ట్గానే తయారవనున్నాయి.
2025 అక్టోబర్ వరకు విండోస్ 10 ఓఎస్ వినియోగదారులకు ఉచితంగా సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వనున్న మైక్రోసాఫ్ట్.. ఆ తర్వాత మాత్రం ఇందుకు కొంతమేర వార్షిక చార్జీల (ఎంత? అన్నది తెలియాల్సి ఉన్నది)ను వసూలు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇలా మరో మూడేండ్లు ఔట్డేటెడ్ పీసీలతో పనిచేసుకునే వెసులుబాటును కస్టమర్లకు కల్పించాలని సంస్థ భావిస్తున్నట్టు సమాచారం. అయితే 2028 అక్టోబర్ తర్వాత మాత్రం పూర్తిగా విండోస్ 10 ఓఎస్కు గుడ్బై చెప్పాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించినట్టు చెప్తున్నారు. దీంతో సెక్యూరిటీ అప్డేట్లు లేక వైరస్ సమస్యలు, పని నెమ్మదించడం వంటి ఇబ్బందులను కస్టమర్లు ఎదుర్కోనున్నారు.
మైక్రోసాఫ్ట్ నిర్ణయంతో వచ్చే ఈ-వేస్ట్తో సమస్యలు ఏర్పడుతాయని ఓవైపు పర్యావరణ ప్రేమికులు వాదిస్తుంటే.. దానివల్ల ప్రత్యామ్నాయ ఉపయోగాలూ ఉన్నాయని మరోవైపు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. పర్సనల్ కంప్యూటర్లలో వాడే హార్డ్ డ్రైవ్లు, డాటా స్టోరేజీ సర్వర్లను రీసైక్లింగ్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికిల్ మోటార్లలో వినియోగించే మెటీరియల్స్ను సిద్ధం చేసుకోవచ్చని, పునరుత్పాదక శక్తిని కూడా సృష్టించవచ్చని చెప్తున్నారు. విండ్ టర్బైన్లకు వినియోగించి విద్యుదుత్పత్తిని చేయవచ్చని నోవెన్ మ్యాగ్నెటిక్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పీటర్ అఫ్నీ అంటున్నారు. ఈ-వేస్ట్ నుంచి లిథియం, కోబాల్ట్, నికెల్, కాపర్ వంటి లోహాలను వెలికితీసి వాటిని బ్యాటరీల తయారీకి వాడుకోవచ్చని బ్యాటరీ రీసైక్లింగ్ సంస్థ రెడ్వుడ్ మెటీరియల్స్ చెప్తున్నది. ముఖ్యంగా విండోస్ 10 ఓఎస్ పనిచేయకపోతే తర్వాతి తరం ఓఎస్కు పీసీ వినియోగదారులు మారిపోతారని, దానివల్ల ప్రస్తుతం మందగమనంలో ఉన్న పీసీ మార్కెట్లో తిరిగి అమ్మకాల ఉత్సాహం నెలకొంటుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్ఫోన్లు, ల్యాప్ట్యాప్లు వచ్చిన తర్వాత పీసీలకు మార్కెట్లో కొంతవరకు డిమాండ్ తగ్గిన విషయం తెలిసిందే.
విండోస్ 10 ఓఎస్కు సపోర్ట్ను నిలిపివేయాలన్న మైక్రోసాఫ్ట్ నిర్ణయం 48 కోట్ల కిలోల ఈ-వేస్ట్కు దారితీస్తున్నదని కెనాలిస్ రిసెర్చ్ అంచనా వేస్తున్నది. ఈ మొత్తం 3.2 లక్షల కార్ల బరువుతో సమానం కావడం గమనార్హం. దీనివల్ల పర్యావరణ అసమతౌల్యం ఏర్పడుతుందని, వాతావరణ మార్పులు, భూ కాలుష్యం ఉంటాయని చెప్తున్నది. ఇప్పటికే భూ తాపంతో వాతావరణంలో రకరకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఇవి మానవాళి, జంతుజాలం, ఇతర ప్రాణుల మనుగడనే దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈ-వేస్ట్ భూమిలోకి చేరితే మరిన్ని దుష్పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నది. అంతేగాక విండోస్ 10 ఓఎస్ నుంచి కస్టమర్లను బలవంతంగా మరో అప్డేట్ వెర్షన్కు మార్చే పనే ఇదంతా అంటూ అభివర్ణించిన కెనాలిస్.. పీసీ యూజర్లపై అనవసర వ్యయ భారం వేస్తున్నారని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది.