MG Motor India | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘ఎంజీ మోటార్ ఇండియా` వచ్చే ఐదేండ్లలో తమ మార్కెట్ వాటా పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గుజరాత్ కేంద్రంగా బ్యాటరీ అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయడంతోపాటు ఐదు కొత్త మోడల్ కార్లను మార్కెట్లోకి తేవాలని తల పోస్తున్నది. ఇందుకోసం రూ.5000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నది. సుస్థిరమైన ప్రగతి కోసం భారత్లోనే కార్ల ఉత్పత్తితోపాటు బిజినెస్ ఆపరేషన్లకు కొత్త కార్యాచరణ రూపొందిస్తున్నది.
ఎంజీ మోటార్ ఇండియా తన ఐదేండ్ల ప్రణాళికలో ఐదు కొత్త కార్లు.. దాదాపు ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీస్) మార్కెట్లో లాంచ్ చేయాలని భావిస్తున్నది. ఈవీల ఉత్పత్తి వేగవంతం చేయడంతోపాటు ఈవీ బ్యాటరీ ప్యాక్స్ అసెంబ్లింగ్, వివిధ ఈవీ కాంపొనెంట్ల తయారీ కూడా దేశీయంగా చేపట్టాలని నిర్ణయించింది. తద్వారా 2028 నాటికి ఈవీ మార్కెట్లో తన వాటా 65 నుంచి 75 శాతానికి పెంచుకోవాలని యోచిస్తున్నది.
గుజరాత్ రాష్ట్రంలో రెండో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా కార్ల తయారీ 1.20 లక్షల నుంచి మూడు లక్షలకు పెంచాలని నిర్ణయించింది ఎంజీ మోటార్ ఇండియా. అంతే కాదు అడ్వాన్స్డ్ అండ్ క్లీన్ టెక్నాలజీస్లో పెట్టుబడులు పెట్టనున్నది. ప్రత్యేకించి హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్స్, ఈవీ సెల్ మాన్యుఫాక్చరింగ్లో పెట్టుబడులు పెట్టనున్నది.
అంతేకాదు సమీప భవిష్యత్లో ‘ఆటోమొబైల్ రంగంలో ఫ్యూచర్ టెక్నాలజీస్’పై లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని కూడా ఎంజీ మోటార్ ఇండియా సంకల్పించింది. ఈవీ, అడాస్, కనెక్టెడ్ కార్ సిస్టమ్స్ తదితర టెక్నాలజీపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నది. 2028 నాటికి 20 వేల మందికి ఉద్యోగాలివ్వాలని సంకల్పించింది ఎంజీ మోటార్ ఇండియా.