న్యూఢిల్లీ, మార్చి 20: జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జీఐఎల్)లో జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్) విలీనం కానున్నట్టు జీఐఎల్ సోమవారం తెలిపింది. సంబంధిత రెగ్యులేటరీ అనుమతులకు లోబడి వచ్చే ఆర్థిక సంవత్సరంలో విలీనం పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఫ్రాన్స్కు చెందిన ఎరోపోర్ట్స్ డీ పారిస్ ఎస్ఏ (గ్రూప్ ఏడీపీ) జీఏఎల్లో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు గతంలో ఒక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
ఈ నేపథ్యంలో ప్రతిపాదిత విలీనం గ్రూప్ ఏడీపీతో భాగస్వామ్యం పటిష్టపడుతుందని, భవిష్యత్ వృద్ధి అవకాశాలకు అనుగుణంగా బ్యాలెన్స్ షీట్ పటిష్టపడుతుందని జీఐఎల్ వివరించింది. విలీనం పూర్తయిన తర్వాత జీఐఎల్లో జీఎమ్మార్ గ్రూప్ 33.7 శాతం వాటాతో అతిపెద్ద షేర్హోల్డరుగా కొనసాగుతుంది. గ్రూప్ ఏడీపీ వద్ద 32.3 శాతం, పబ్లిక్ వద్ద 34 శాతం చొప్పున వాటాలుంటాయని జీఐఎల్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.