న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ప్రైవేట్ రంగంలో మూడో పెద్ద బ్యాంక్ అయిన కొటక్ మహీంద్రా బ్యాంక్తో కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫెడరల్ బ్యాంక్ విలీనమవుతుందన్న వార్తలు వెలువడుతున్నాయి. విలీనం కోసం ఇరు బ్యాంక్లు చర్చలు జరుపుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇవి కేవలం ఊహాజనిత వార్తలే అని ఫెడరల్ బ్యాంక్ కొట్టివేసినప్పటికీ, విలీన వార్తల్ని బ్యాంక్ ఖండించలేదని, విలీనం జరిగే అవకాశాలున్నాయంటూ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. కాగా, ఫెడరల్ బ్యాంక్ విలీనమైతే కొటక్ బ్యాంక్ ఈపీఎస్ 12 శాతం మేర పెరుగుతుందని సీఎల్ఎస్ఏ పేర్కొంది. ఫండమెంటల్గా చూస్తే ప్రాంతీయ బ్యాంక్లు వాటి మార్కెట్లలో పటిష్ఠమైన లయబిలిటీ ఫ్రాంచైజీని కలిగివున్నాయని, వృద్ధి కోసం చూస్తున్న కొటక్ బ్యాంక్కు ఈ విలీనం సానుకూల ఫలితాల్ని ఇస్తుందని బ్రోకరేజ్ సంస్థ తన నోట్లో తెలిపింది.
ఫెడరల్ బ్యాంక్ 1,300 శాఖల్ని నిర్వహిస్తున్నది. ఫెడరల్ శాఖలున్న ప్రాంతాల్లో కొటక్ బ్యాంక్ శాఖలు తక్కువ. వచ్చే మూడేండ్లలో కొటక్ మహీంద్రా బ్యాంక్ వార్షిక రుణ వృద్ధి 20 శాతంపైనే ఉంటుందని అంచనా వేస్తున్నామని, అయితే ఈ బ్యాంక్ డిపాజిట్ల సమీకరణలో సవాళ్లు ఎదుర్కొంటుందని భావిస్తున్నట్టు సీఎల్ఎస్ఏ తెలిపింది. ఈ కారణంగా ఫెడరల్ బ్యాంక్ డిపాజిట్ బేస్ కలిస్తే మొత్తంగా కొటక్ బ్యాంక్ డిపాజిట్ బేస్ పెరుగుతుందన్నది.
జూన్తో ముగిసిన త్రైమాసికంలో కొటక్ బ్యాంక్ డిపాజిట్లు 10.2 శాతం వృద్ధితో రూ.3.16 లక్షల కోట్లకు చేరగా, ఇదే కాలంలో ఫెడరల్ బ్యాంక్ డిపాజిట్లు 8.2 శాతం వృద్ధితో రూ.1.8 లక్షల కోట్లకు పెరిగాయి. ఫెడరల్ బ్యాంక్ డిపాజిట్లలో కేవలం రిటైల్ డిపాజిట్ల్లే 94 శాతం ఉన్నాయి. గతంలో కొటక్ మహీంద్రా బ్యాంక్లో కలిసిన ఐఎన్జీ వైశ్యా బ్యాంక్లా కాకుండా ఫెడరల్ బ్యాంక్ షేర్హోల్డర్ల బేస్ విస్త్రతంగా ఉంది. విలీనంతో ప్రీమియం ధరతో కొటక్ బ్యాంక్ షేర్లు సొంతం చేసుకోవడానికి ఫెడరల్ బ్యాంక్ షేర్హోల్డర్లకు పెద్దగా అభ్యంతరం కూడా ఉండదని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది.