HDFC Bank CEO | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ శశిధర్ జగదీశన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) విలీనం సరైన సమయంలో జరుగలేదన్నారు. బ్యాంకు నిజంగా విశ్వసించిన సమయానికి రెండు సంస్థల విలీనం జరుగలేదని బ్యాంక్ వార్షిక నివేదికలో పేర్కొన్నారు.
‘మొత్తం బ్యాంకు ఖాతాదారుల్లో కేవలం రెండు శాతం మంది మాత్రమే మా బ్యాంకు నుంచి ఇండ్ల రుణాలు తీసుకుంటున్నారు. మరో ఐదు శాతం మంది ఇతర ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి ఇండ్ల రుణాలు పొందుతున్నారు. ఇది పెద్ద అవకాశం. కస్టమర్కు, బ్యాంకుకు మధ్య ఉన్న అనుబంధం. ఖాతాదారు, బ్యాంకు మధ్య అనుబంధం పెంపొందించాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.
డిజిటల్ ఫాట్ఫామ్స్, శాఖల నెట్ వర్క్ సేవల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు శక్తిమంతమైన సేవలందిస్తున్నదని శశిధర్ జగదీశన్ పేర్కొన్నారు. బ్యాంకు, దాని అనుబంధ సంస్థలు, సేవల ద్వారా పూర్తిస్థాయిలో కస్టమర్లకు ఇండ్ల రుణాలు అందించగల శక్తి సామర్థ్యాలు సంపాదించుకోవాలని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఇండ్ల కొనుగోళ్లు వేగవంతం కావడమే కాదని, భారత్ వృద్ధికి దోహద పడుతుందని శశిధర్ జగదీశన్ అభిప్రాయ పడ్డారు. వచ్చే దశాబ్ధ కాలంలో అందుబాటు ధరలో హౌసింగ్.. భారత్ వృద్ధికి కీలకం అవుతుందన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడులు కీలకం అని స్పష్టం చేశారు.
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం తర్వాత మౌలిక వసతుల ప్రాజెక్టులపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫోకస్ చేయాలని చెప్పారు. తద్వారా జాతి నిర్మాణంలో బ్యాంకు అర్థవంతమైన పాత్ర పోషించాలన్నారు. భవిష్యత్ వృద్ధికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్-హెచ్డీఎఫ్సీ విలీనం దోహద పడాలని, మరింత మంది భారతీయులు ఇండ్లు కొనుక్కోవడంతోపాటు ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. దీనివల్ల ఆర్థిక వృద్ధి రేటు మరింత పెరుగుతుందన్నారు.