Tokenisation | సైబర్ఫ్రాడ్కు తెర దించేందుకు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వాడకంపై టోకెనైజేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఆర్బీఐ సర్వం సిద్ధం చేసింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ టోకెనైజేషన్ పాలసీ అమల్లోకి రాబోతున్నది. దేశీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇందుకు సిద్ధం అయ్యాయి. కానీ, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, స్పొటిఫై, డిస్నీ హాట్స్టార్ వంటి గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి టోకెనైజేషన్ ప్రకియ అమలుకు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల టోకెనైజేషన్ సాధ్యాసాధ్యాలపై ఈ గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. మర్చంట్ల వద్ద సబ్స్క్రైబర్ కార్డ్ డేటా స్టోరేజీపై నిషేధం అమలు చేస్తే సాంకేతిక లోపాల్లేకుండా నిరంతరాయంగా, స్వేచ్ఛగా లావాదేవీలు జరిగేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోవాలని కోరాయి.
యూజర్ల డేటా నిషేధం నిబంధన అమలు నేపథ్యంలో టోకెనైజేషన్ ద్వారా రికరింగ్ లావాదేవీల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించాలని ఆర్బీఐని కోరిందని సమాచారం. మర్చంట్ పేమెంట్స్ అలయెన్స్ ఆఫ్ ఇండియా (ఎంపీఏఐ). వివిధ మర్చంట్ సంస్థలు అలయెన్స్గా ఏర్పాటయ్యాయి. `టోకెనైజేషన్ లావాదేవీలకు సంసిద్ధం అంటూ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నెట్వర్క్లు, పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్వేస్ తమ స్టేటస్ రిపోర్ట్ షేర్ చేసేలా చర్యలు తీసుకోవాలి` అని ఆర్బీఐకి ఈ అలయెన్స్ కోరింది.
సమస్యలను పరిష్కరించాకే టోకెనైజేషన్ ప్రక్రియ అమలుకు చర్యలు తీసుకోవాలని ఎంపీఏఐ ఆర్బీఐని అభ్యర్థించింది. అందుకోసం టోకెనైజేషన్ ప్రక్రియ అమలును మరోమారు వాయిదా వేయాలని ఆర్బీఐని మర్చంట్స్ అలయెన్స్ కోరనున్నది. ఇప్పటికే టోకెనైజేషన్ ప్రక్రియ అమలు మూడుసార్లు వాయిదా పడింది. గత జూలైలోనే మరోమారు గడువు పొడిగించే ప్రసక్తి లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.