న్యూఢిల్లీ, మే 9 : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ వచ్చే నాలుగు నెలల్లో అన్ని రకాల మాడళ్ల ధరలను 3 శాతం వరకు సవరించబోతున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు దఫాలుగా తమ కార్ల ధరలు రూ.90 వేల నుంచి రూ.12.2 లక్షల వరకు పెంచుతున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఫారెక్స్ మార్కెట్లో కరెన్సీలు తీవ్ర ఒడిదొడుకులకు లోనుకావడం వల్లనే ధరలు పెంచాల్సి వస్తున్నదని పేర్కొంది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంలో సీ-క్లాస్ మాడల్ రూ.90 వేల వరకు, బెంజ్ మేబ్యాక్ ఎస్ 680 మాడల్ రూ.12.2 లక్షల వరకు ప్రియంకానున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ ఐయర్ తెలిపారు.
జూన్ 1న తమ వాహన ధరలను 1-2 శాతం వరకు పెంచుతున్న సంస్థ.. సెప్టెంబర్ 1 నుంచి 1.5 శాతం వరకు సవరిస్తున్నది. గడిచిన నాలుగు నెలల్లో రూపాయి కరెన్సీ భారీగా పడిపోయిందని, ముఖ్యంగా యూరోతో పోలిస్తే 10 శాతం తగ్గడం వల్ల సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మరోవైపు, ఇప్పటికే ఆడీ ఇండియా, బీఎండబ్ల్యూ సంస్థలు కూడా తమ వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి.