Benz Cars Costly | రూ.5 లక్షల వరకు పెంచిన సంస్థ
న్యూఢిల్లీ, మార్చి 17: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ వాహన కొనుగోలుదారులకు మరోమారు షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని మోడళ్ళ ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మూలధన వ్యయం పెరగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆయా మోడళ్ళు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు అధికమవనున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు రవాణా కోసం అయ్యే ఖర్చులు అధికమైన కారణంగా ధరలను 3 శాతం వరకు సవరించాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో వెల్లడించింది.
దీంతో ఏ200 లిమౌసిన్ ప్రారంభ ధర రూ.42 లక్షలకు చేరుకోనుండగా, జీఎల్ఏ 200 ధర రూ.45 లక్షలు, జీఎల్సీ 200 ప్రారంభ ధర రూ.62 లక్షలకు, జీఎల్ఈ 300 డీ 4 ఎం ప్రారంభ ధర రూ.86 లక్షలు, జీఎల్ఎస్ 400డీ 4 ఎం ప్రారంభ ధర రూ.1.16 కోట్లు, ఎల్డబ్ల్యూబీ ఈ-క్లాస్ 200 ప్రారంభ ధర రూ.71 లక్షలు, ఎస్-క్లాస్ 350 డీ ప్రారంభ ధర రూ.1.6 కోట్లు, ఏఎంజీ ఈ 63 ఎస్4 మ్యాటిక్ ప్రారంభ ధర రూ.1.77 కోట్లతో లభించనున్నాయి.
న్యూఢిల్లీ, మార్చి 17: ఓలా ఎలక్ట్రిక్ సంస్థ తన ఎస్1 ప్రొ ఈ స్కూటర్ల ధరల్ని పెంచనున్నట్టు ప్రకటించింది. ధరల పెంపు వచ్చే పర్చేజ్ విండోలో జరిగే కొనుగోళ్లకు వర్తిస్తాయని కంపెనీ గురువారం తెలిపింది. అయితే ధరల్ని ఎంతమేర పెంచేదీ, తదుపరి పర్చేజ్ విండో ఏ తేదీన ఓపెన్ చేసేదీ ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించలేదు. హోలీ సందర్భంగా కొత్త రంగులతో కూడిన ఎస్1 ప్రొ స్కూటర్ మార్చి 18న అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. రూ.1,29,999 ధరకు ఎస్1 ప్రొ కొనేందుకు ఇదే చివరి అవకాశమని, వచ్చే పర్చేజ్ విండో నుంచి ధరలు పెంచుతామని ఓలా వ్యవస్థాపకుడు భావిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు.