హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రెరా ద్వారా కొనుగోలుదారులకు భరోసా కల్పించాలని హర్యానా రాష్ట్ర గురుగ్రామ్ రెరా సభ్యులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అశోక్ సంగ్వామ్ అన్నారు. హైదరాబాద్లోని రెరా కార్యాలయాన్ని సందర్శించి రెరా చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, సభ్యులు కే శ్రీనివాసరావు, జే లక్ష్మీనారాయణ, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. రెరా చట్టంపై ఇరు రాష్ర్టాల్లో జరుగుతున్న అమలుపై పరస్పరం చర్చించారు. కొనుగోలుదారుల హకులు, పరిరక్షణ కోసం బిల్డర్లు, ప్రమోటర్ల పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసేందుకు రెరా చట్టం అమలులోకి వచ్చిందని, దానిని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేయాల్సిన అవసరం ఉందని అశోక్ సంగ్వామ్ అన్నారు.
రెరా రిజిస్ట్రేషన్ లేనిది కొనుగోలు చేయమనే భావన కూడా కొనుగోలుదారులలో రావాలని, తద్వారా రియాల్టర్లు విధిగా రెరాలో రిజిస్టర్ అవుతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రెరా చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రెరా రిజిస్ట్రేషన్ విధానాన్ని అనుసరిస్తూ బిల్డర్లు, ప్రమోటర్లు పారదర్శకత జవాబుదారీతనంతో పని చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.