ముంబై: ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) సెగ్మెంట్లో శరవేగంగా దూసుకెళ్తున్నది టాటా మోటార్స్. మరింత విస్తరించే దిశగా ప్రయాణిస్తున్నది. వచ్చే నాలుగేండ్లలో 10 బ్యాటరీ ఎలక్ట్రిక్ కార్లను విపణిలో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ సంగతిని టాటా మోటార్స్ 76వ వార్షికోత్సవ సమావేశంలో సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు.
2025 నాటికి పది టాటా మోటార్స్ బీఈవీ న్యూ వెహికల్స్ మార్కెట్లోకి వస్తాయని చెప్పారు. టాటా సన్స్ అనుబంధ బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు జాగ్వార్, లాండ్ రోవర్లతో పోటీ పడేందుకు మరో ఎలక్ట్రిక్ వెహికల్ సిద్ధం అవుతున్నదని అన్నారు.
విద్యుత్ వాహనాల (ఈవీ)ను ఆవిష్కరించడంతోపాటు టాటా గ్రూప్ దేశవ్యాప్తంగా చార్జింగ్ మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నది. భారత్లోనూ, బయటా సెల్, బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ వసతుల కల్పనకు భాగస్వాముల కోసం అన్వేషిస్తున్నది.
ప్రస్తుతానికి టాటా నెక్సన్ ఈవీ.. బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. దేశీయ మార్కెట్లో నెక్సన్ ఈవీ, టైగర్ ఈవీ దూసుకెళ్తున్నాయి. త్వరలో ఆల్ట్రోజ్ ఈవీ వర్షన్ విపణిలోకి రానున్నది. నెక్సాన్ ఈవీని గతేడాది జనవరిలో ఆవిష్కరించారు.
టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్.. 10 న్యూ లగ్జరీ కార్లను ఆవిష్కరించనున్నది. 2025 నాటికి ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో తన వాటాను బలోపేతం చేసుకోవాలని జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ భావిస్తున్నది.