న్యూఢిల్లీ, నవంబర్ 15: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. అన్ని కాలవ్యవధుల రుణాలపైనా 15 బేసిస్ పాయింట్లదాకా ఎంసీఎల్ఆర్ను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు మంగళవారం నుంచే అమల్లోకి వస్తుందని ఈ సందర్భంగా బ్యాంక్ తమ వెబ్సైట్లో స్పష్టం చేసింది. ఎంసీఎల్ఆర్ అంటే ఖాతాదారులకిచ్చే రుణాలపై బ్యాంకులు వసూలు చేసే కనీస వడ్డీరేటన్నది తెలిసిందే.
పెరగనున్న ఈఎంఐలు
తాజా నిర్ణయంతో గృహ, ఆటో, వ్యక్తిగత రుణాల వంటి కన్జ్యూమర్ లోన్లు ఎస్బీఐ ఖాతాదారులకు ప్రియం కానున్నాయి. ఓవర్నైట్, ఏడాది, రెండేండ్లు, మూడేండ్ల ఎంసీఎల్ఆర్లు 10 బేసిస్ పాయింట్ల చొప్పున పెరిగాయి. అయితే నెల, 3 నెలలు, 6 నెలల ఎంసీఎల్ఆర్లు 15 బేసిస్ పాయింట్ల చొప్పున ఎగిశాయి. కాగా, గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటును చాలావరకు ఏడాది ఎంసీఎల్ఆర్ ఆధారంగానే నిర్ణయిస్తారు. దీంతో ఈ రుణగ్రహీతల ఈఎంఐలు ఇంకా పెరగనున్నాయి.
మళ్లీమళ్లీ వడ్డింపులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల రుణాలపై వడ్డీరేట్లూ పెరుగుతూపోతున్నాయి. కరోనా ప్రభావంతో పడకేసిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పరుగులు పెట్టించేందుకు ఆర్బీఐ చర్యలకు ఊతమిస్తూ బ్యాంకులు రుణాలపై గత రెండేండ్లూ వడ్డీరేట్లను గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది రుణాలు తీసుకున్నారు. ముఖ్యంగా గృహ రుణాలు చౌకగా మారా యి. అయితే ఈ రుణగ్రహీతలపై ఇప్పుడు పెను భారమే పడుతున్నది. కరోనాకు ముం దున్న స్థాయికి ఇప్పటికే వడ్డీరేట్లు చేరగా.. తాజా వడ్డింపులు భారాన్ని మోపుతున్నాయి.
ఎస్బీఐ మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ) ఏకంగా రూ.లక్ష కోట్లు దాటాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త పల్నాటి రాజేంద్ర చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఎస్బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది. ఇచ్చిన అప్పుల్లో ఇప్పటిదాకా రూ.1.71 లక్షల కోట్లు ఇంకా తిరిగి రాలేదని, వీటిలో రూ.1,06,804 కోట్లు ఎన్పీఏలుగా మారాయని బ్యాంక్ ఈ సందర్భంగా వివరించింది.