హైదరాబాద్, అక్టోబర్ 10: ప్రముఖ కంటి ఆసుపత్రుల నిర్వహణ సంస్థ మ్యాక్సివిజన్.. హైదరాబాద్లో సూపర్ టెర్టిరీ ఐ కేర్ సెంటర్ను ప్రారంభించింది. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.20 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న ఆరోగ్యశ్రీ, ఉద్యోగశ్రీ కార్డు కలిగిన వారికి చికిత్స చేయనున్నారు. ఈ సందర్భంగా మ్యాక్సివిజన్ గ్రూపు సీఈవో వీఎస్ సుధీర్ మాట్లాడుతూ..ప్రస్తుతం మెట్రో నగరాలకు పరిమితమైన ఆసుపత్రులను ఇక నుంచి ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించనున్నట్టు, ఇందుకోసం వచ్చే మూడు నుంచి నాలుగేండ్లలో రూ.1,400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించారు.
వీటిలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లలో రూ.500 కోట్లతో విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 28 ఉండగా, వచ్చే మూడేండ్లలో కొత్తగా 12 ఆసుపత్రులను ఏర్పాటు చేయనుండగా..అలాగే ఏపీలో ప్రస్తుతం ఆరు ఉండగా, వీటి సంఖ్యను 30కి పెంచుకోనున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ర్టాల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు తన వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా సిద్దిపేట, కరీంగనర్, నిజామాబాద్, వరంగల్తోపాటు ఇతర చిన్న నగరాల్లో సైతం హాస్పిటల్స్ను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
కొత్తగా 1,500 ఉద్యోగాలు
కొత్తగా ఆసుపత్రులను నిర్మిస్తుండటంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే 1200 మంది ఉద్యోగులు, 200 మంది డాక్టర్లు ఉండగా, కొత్తగా ఏర్పాటు చేయనున్న దవాఖానల కోసం 1,000-1,500 మంది సిబ్బందిని, 150 డాక్టర్లను రిక్రూట్ చేసుకోనున్నది. అలాగే వచ్చే నెలలో తార్నాక, మణికొండ, అత్తాపూర్లలో కూడా కంటి దవాఖానాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.