న్యూఢిల్లీ, జూన్ 2: మే నెలలో ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు భారీగా ఎగబాకింది. ఎగుమతులు 15.46 శాతం వృద్ధిచెంది 37.3 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు ఏకంగా 56.14 శాతం వృద్ధితో 60.62 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 23.33 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు గురువారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. 2022 ఏప్రిల్లో ఇది 20.11 బిలియన్ డాలర్లు. 2021 మే నెలలో వాణిజ్యలోటు 6.53 బిలియన్ డాలర్లే. పెట్రోలియం, క్రూడాయిల్ దిగుమతులు 2022 మే నెలలో 91.16 శాతం అధికమై 18.14 బిలియన్ డాలర్లకు చేరడంతో మొత్తంగా దిగుమతుల్లో భారీ పెరుగుదల చోటుచేసుకున్నది. బొగ్గు, కోక్ దిగుమతులు కూడా 2 బిలియన్ డాలర్ల నుంచి దాదాపు రెండు రెట్లు పెరిగి 5.82 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పుత్తడి దిగుమతులు సైతం జోరందుకున్నాయి. ఇవి 677 మిలియన్ డాలర్ల నుంచి 5.82 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గతేడాది మే నెలలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అప్పుడు దిగుమతులు సైతం మందకొడిగా జరిగాయి. ఇక ఎగుమతుల్లో ఇంజనీరింగ్ ఉత్పత్తులు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇవి 7.84 శాతం వృద్ధితో 9.3 బిలియన్ డాలర్లకు చేరగా, 8.11 బిలియన్ డాలర్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. జెమ్స్, జ్యువెలరీ ఎగుమతులు 3.1 బిలియన్ డాలర్లకు, రసాయినాల ఎగుమతులు 2.5 బిలియన్ డాలర్లకు పెరిగాయి.