Maruti-Toyota | విద్యుత్ వాహనాలదే ఇక భవిష్యత్. దాదాపు అన్ని కార్లు, టూ వీలర్స్ తయారీ సంస్థలు విద్యుత్ ఆధారిత వెహికల్స్ తయారీలో నిమగ్నమయ్యాయి. కొన్ని సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు, బైక్లు, స్కూటర్లు ఇప్పటికే విపణిలోకి వచ్చేశాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (ఎంఎస్ఐ) కూడా ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) సెగ్మెంట్లోకి అడుగు పెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్తో కలిసి గ్లోబల్ మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అభివృద్ధి చేస్తున్నది మారుతి సుజుకి. ఈ కారుకు వైవై8 కోడ్నేమ్ పెట్టాయి. ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన ఈవీ కార్ల కంటే చాలా శక్తిమంతమైన ఎలక్ట్రిక్ కారుగా నిలువనున్నది.
టాటా నెక్సాన్ ఈవీ కంటే మారుతి-టయోటా ఎలక్ట్రిక్ ఎస్యూవీ పొడవుగా ఉంటుంది. 48కిలోవాట్లు లేదా 59 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో అందుబాటులోకి రానున్నది. 400-500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉంటుంది. టాటా నెక్సాన్ ఈవీతో మారుతి-టయోటా ఈవీ కారు పోటీ పడుతుందని భావిస్తున్నారు. మారుతి-టయోటా వైవై8 కారు పొడవు 4.2 మీటర్ల కంటే ఈ రెండు సంస్థల ఎలక్ట్రిక్ మిడ్సైజ్ ఎస్యూవీ కారు పొడవుగా ఉంటుంది.
వైవై8 కారు పొడవులో నెక్సాన్ ఈవీ కంటే ఎక్కువ. నెక్సాన్ ఈవీ, ఎంజీ మోటార్స్ జడ్ఎస్ ఈవీలకంటే మారుతి-టయోటా ఎలక్ట్రిక్ మిడ్ సైజ్ ఎస్యూవీ వీల్ బేస్ పెద్దగా ఉంటుంది. ఈ రెండు కార్ల కంటే మారుతి-టయోటా మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ బ్యాటరీ సైజ్ పెద్దగానే డిజైన్ చేశారు.
మారుతి-టయోటా అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారులో వినియోగించే భారత్లో తయారు చేసిన బ్యాటరీలే వాడతారు. గుజరాత్లోని లిథియం అయాన్ బ్యాటరీ మాన్యుఫాక్చరర్ టీడీఎస్జీ ఈ బ్యాటరీలు తయారు చేస్తున్నది. ఈ బ్యాటరీని సుజుకి మోటార్ కార్పొరేషన్, డెన్సో కార్పొరేషన్, తొషిబా కార్పొరేషన్ ఉమ్మడిగా డెవలప్చేస్తున్నాయి.
2025లో మారుతి- టయోటా వైవై8 ఎలక్ట్రిక్ వెహికల్ విపణిలోకి రానున్నది. రెండు కంపెనీలు కారు ధర తగ్గించడంపైనే ఫోకస్ చేస్తున్నాయి. టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ మోటార్స్ జడ్ఎస్ ఈవీ కంటే మారుతి- టయోటా ఈవీ కారు ధర తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారు ధర రూ.13-15 లక్షలు ఉంటుందని అంచనా. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ.14.29 లక్షలు-రూ.16.70 లక్షల మధ్య, ఎంజీ మోటార్స్ జడ్ఎస్ ధర రూ. 21.49-25-18 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.