SUV Cars | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మార్కెట్లోకి మరికొన్ని స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కార్ల విక్రయంలో ఎస్యూవీ క్యాటగిరీ కార్ల వాటా గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నది. అందులో భాగంగా ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన రెండు ఎస్యూవీలు న్యూ బ్రెజా, గ్రాండ్ విటారాలకు సానుకూల స్పందన వస్తున్నదని మారుతి సుజుకి ప్రతినిధులు చెప్పారు.
`గత జూలై కార్ల విక్రయాల్లో ఎస్యూవీ సెగ్మెంట్ వాటా 7.1 శాతం, ఆగస్టుకల్లా 10.8 శాతానికి పెరిగింది, సెప్టెంబర్లో 13.01, అక్టోబర్లో 14.4 శాతానికి పెరిగింది. గత నాలుగు నెలలుగా జరుగుతున్న విక్రయాల్లో ఎస్యూవీ సేల్స్ పెరుగుతున్నాయని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని ఎస్యూవీ కార్లు అమ్ముడవుతాయని ఖచ్చితంగా చెప్పలేం కానీ.. గణనీయ పెరుగుదల ఉంటుందని భావిస్తున్నామని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. త్వరలో మరికొన్ని ఎస్యూవీ కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తామన్నారు. కార్ల విక్రయ మార్కెట్లో తమ వాటా పెంచుకునేందుకు ఎస్యూవీ సెగ్మెంట్ కార్లు కీలకం అని అన్నారు.
2021-22లో మారుతి సుజుకి కార్ల విక్రయంలో ఎస్యూవీల వాటా 10.9 శాతం. కరోనా మహమ్మారితోపాటు సాంకేతిక అంశాల వల్ల గతేడాది ఓవరాల్ సేల్స్ తగ్గుముఖం పట్టాయి. 2019లో 51 శాతం వాటా కార్లను విక్రయించిన మారుతి సుజుకి.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 41 శాతానికి పడిపోయింది. కంపాక్ట్ – ఎస్యూవీ సెగ్మెంట్లో బ్రెజా లీడింగ్లో కొనసాగుతుండగా, మిడ్ సైజ్డ్ గ్రాండ్ విటారా విక్రయాలు కూడా మెరుగ్గానే ఉంటాయని మారుతి సుజుకి భావిస్తున్నది.