Maruti Suzuki : మారుతి సుజుకి కార్లు మరింత ప్రియం కానున్నాయి. అందుకు కారణం ఏంటంటే.. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కార్ల ధరను పెంచనుంది. 2023 జనవరి నుంచి తమ కంపెనీ కార్ల ధర పెంచుతున్నామని మారుతీ సుజుకీ శుక్రవారం వెల్లడించింది. అయితే.. కార్ల మోడల్స్ను బట్టి ధరలో తేడా ఉంటుందని తెలిపింది. తయారీ ఖర్చు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు తయారీ ఖర్చును తగ్గించుకునే పనిలో ఉన్నట్టు సంస్థ చెప్పింది.
ఈ ఏడాది నవంబర్ నాటికి 1,59,044 మారుతి సుజుకి వాహనాల అమ్మకాలు జరిగాయి. వీటిలో భారతదేశవ్యాప్తంగా 1,35,055 వాహనాలు అమ్ముడుపోయాయి. 19,738 వాహనాలను ఎగుమతి చేసింది. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్ ప్రెస్సో కార్లు అత్యధికంగా (18,251) సేల్ అయ్యాయి. స్విఫ్ట్, వితార బ్రెజా, ఎర్టిగా కార్లు అన్నీ కలిపి 32,563 అమ్మకాలు జరిగాయి. మారుతి సుజుకి కంపెనీ వాహనాల ధరలు పెంచడం ఇదే మొదటిసారి కాదు. 2021 జనవరి నుంచి 2022 మార్చి నాటికి కార్ల ధరను దాదాపు 8.8శాతం పెంచింది. ప్రస్తుతం రవీంద్ర చంద్ర భార్గవ మారుతి సుజుకి సీఈఓగా ఉన్నారు.