న్యూఢిల్లీ, మే 21 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కొనుగోలుదారులకు గట్టి షాకిచ్చింది. వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కార్ల ధరలను రూ.30 వేల వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికం కావడంతోపాటు ప్రతికూల వ్యయాలు పెరుగడం వల్లనే ధరలు సవరించాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
గడిచిన కొన్ని నెలలుగా నిర్వహణ ఖర్చులు అధికమైనప్పటికీ పొదుపు చర్యలకు మొగ్గుచూపినట్టు, ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒత్తిళ్లు అధికం కావడంతో ధరలు సవరించాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం సంస్థ రూ.3.49 లక్షలు మొదలుకొని రూ.28.7 లక్షల లోపు ధర కలిగిన పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. గతేడాది జీఎస్టీ ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా వాహన ధరలను రూ.1.30 లక్షల వరకు తగ్గించిన విషయం తెలిసిందే.