న్యూఢిల్లీ, జూన్ 29: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ..చిన్న కార్లకు గుడ్బై పలుకబోతున్నదా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. చిన్న కార్లకు బదులుగా కొనుగోలుదారులు కాంప్యాక్ట్ ఎస్యూవీ, అతిపెద్ద హ్యాచ్బ్యాక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పాలసీల కారణంగా చిన్న కార్లకు స్వస్తి పలుకాలనుకుంటున్నట్లు కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ ఇటీవల వ్యాఖ్యానించడం ఈ వార్తకు నిజం చేకూరుస్తున్నది. అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని కార్లలో ఖచ్చితంగా ఆరు ఎయిర్బ్యాగ్లు ఉండాలన్న కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలతో చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేయాలనుకుంటున్నట్లు భార్గవ అన్నారు.
చిన్న కార్లను ఉత్పత్తి చేయడంతో సంస్థకు ఎలాంటి లాభం లేదని భార్గవ వ్యాఖ్యానించారు. మరోవైపు, గడిచిన ఐదేండ్లుగా కంపెనీకి చెందిన చిన్న వాహనాలు ఆల్టో, ఎస్-ప్రెస్సో అమ్మకాలు భారీగా పడిపోయాయి. 2017-18లో మినీ సెగ్మెంట్(ఆల్టో, వ్యాగన్ఆర్) సంయుక్తంగా 4,27,183 యూనిట్లు అమ్ముడవగా..2021-22లో సగానికి సగం పడిపోయి 2,11,762 యూనిట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, దేశీయ ఆటోమొబైల్ రంగంలో కంపెనీ మార్కెట్ వాటా 50 శాతం నుంచి 42 శాతానికి తగ్గడం కూడా ఇందుకు కారణం. రూ.10 లక్షల లోపు కాంప్యాక్ట్ కారును కొనుగోలు చేయడానికి మధ్యతరగతి భారతీయులు ఆసక్తి చూపుతున్నారు.