Small Cars | మరింతగా కర్బన ఉద్గారాలను నియంత్రించాలని బీఎస్-6 2.0 (BS-6 2.0) దశ నిబంధనలు అమల్లోకి తెచ్చింది కేంద్రం. ఈ నిబంధన అమలు చేయాలంటే కార్ల తయారీ సంస్థలు రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) అనే పరికరం ఏర్పాటు చేయాలి. ఈ పరికరం ఏర్పాటు చేయడం అంటేనే కాస్ట్ లీ వ్యవహారం. కార్ల తయారీ సంస్థలు తమ మార్కెట్ను కాపాడుకోవడానికి బుల్లికార్లపై ఫోకస్ పెడుతున్నాయి. బుల్లి కార్లతోనే భారత కార్ల మార్కెట్ తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది.
మరోవైపు వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి క్రూడాయిల్ దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం.. ఆల్టర్నేటివ్ పవర్ ట్రైన్ స్ట్రాటర్జీస్.. ఫ్లెక్సీ ఫ్యుయల్ మొదలు కంప్రెస్డ్ బయోగ్యాస్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల డెవలప్మెంట్, తయారీని ప్రోత్సహిస్తున్నది. ఫ్యుయల్ ఎఫిషియెన్సీకి.. అంటే ఎక్కువ మైలేజీకి బుల్లికార్లు పెట్టింది పేరు అని.. వాహన కాలుష్యం నియంత్రణకు ఆ కార్లు దోహద పడతాయని కార్ల తయారీ సంస్థల ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. ఈ దశలో సుదీర్ఘ కాలంలో కార్ల కొనుగోలుదారులకు బుల్లి కార్లు ఆమోదయోగ్యం అని మారుతి సుజుకి ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ) సీవీ రామన్ పేర్కొన్నారు. ‘సేఫ్టీ, సుస్టయినబుల్ మొబిలిటీకి స్మాల్ కార్లు ఒక చాయిస్గా చూస్తాం అని అంటారు సీవీ రామన్.
మోటారు సైకిళ్లు, స్కూటర్లకు అతిపెద్ద మార్కెట్ భారత్. 2019లో గరిష్టంగా 2.1 కోట్ల బైక్లు, స్కూటర్లు అమ్ముడయ్యాయి. రోజురోజుకు ఆదాయం పెరగడంతో ప్రతి వెయ్యి కుటుంబాలకు 25 ఇండ్లలో ఎంట్రీ లెవల్ కార్ల కొనుగోళ్లు పెరుగుతాయని భావించారు. కానీ 2019లో 15.5 లక్షల బుల్లి కార్ల విక్రయం జరిగితే 2022లో 11.5 లక్షల కార్లకు పడిపోయాయి. ఇన్ పుట్ కాస్ట్ పెరగడం, రోడ్ టాక్స్ పెరగడం, కర్బన ఉద్గారాల నియంత్రణ, సేఫ్టీ ప్రమాణాలకు ప్రాధాన్యం తదితర అంశాల వల్ల కార్ల ధరలు పెరిగిపోయాయి. దీంతో బుల్లి కార్ల సేల్స్ను దెబ్బ తీశాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
సేల్స్ పడిపోవడంతో నిస్సాన్ నుంచి హోండా కార్స్ ఇండియా, ఫోక్స్ వ్యాగన్ వంటి కార్ల తయారీ సంస్థలు.. బారత్ మార్కెట్ నుంచి నిష్కమించాయి. దీనివల్ల 2019లో 29 రకాల బుల్లి కార్లు మార్కెట్లో ఉంటే ఇప్పుడు ఒక డజన్ ఉండొచ్చునని అంచనా. కానీ, గత కొన్ని నెలలుగా కార్ల సేల్స్ పుంజుకున్నాయి. గత నెలాఖరు నాటికి 134 మిలియన్లకు చేరాయి.
గత కొన్నేండ్లుగా బుల్లి కార్ల సేల్స్ పడిపోతున్నా.. ఇప్పటికీ సేల్స్ భారీగానే ఉన్నాయంటున్నారు మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ. మొత్తం కార్ల కొనుగోళ్లలో కొన్నేండ్లుగా తొలిసారి కార్లు కొనుగోలు చేసేవారు (బుల్లికార్లకు ప్రాధాన్యం ఇస్తున్న వారు) 47-48 శాతం మంది ఉంటారన్నారు. ఇదే ట్రెండ్ ఏండ్ల తరబడి కొనసాగుతున్నదన్నారు. ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ వసతులు సరిగ్గా లేకపోవడం, మార్కెట్లో వెహికల్స్ అందుబాటులో లేకపోవడంతో కార్ల కొనుగోలుదారుల చూపు బుల్లి కార్లపై పడుతున్నదన్నారు. కొత్తదైనా, సెకండ్ హ్యాండ్ కారైనా ఎంట్రీ లెవల్కు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఆదాయం స్థాయి యథాతథంగా కొనసాగితే అందుబాటులో ధరలోనే కార్లు లభిస్తాయని, గ్రోత్ సాధించడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయంటున్నారు.
హ్యుండాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సేల్స్, మార్కెటింగ్, సర్వీస్ అండ్ ప్రొడక్ట్ స్ట్రాటర్జీ) తరుణ్ గార్గ్ స్పందిస్తూ.. ‘ఎంట్రీ లెవల్ కార్లు అందుబాటు ధరలో ఉంటాయి. తక్కువ ధరలకు అందుబాటులో ఉండే కార్లంటే సీఎన్జీ వేరియంట్ కార్లు ఒక మంచి ఆప్షన్’ అని ఇటీవల ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో చెప్పారు. నగరాల పరిధిలోనూ, భౌగోళికంగానూ ప్రజాదరణ పొందిన బుల్లి సీఎన్జీ కార్లు వినియోగదారులకు ఆమోద యోగ్యమైన ఆప్షన్గా నిలుస్తుందన్నారు.