Maruti Suzuki | దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 9,925 మూడు మోడల్ కార్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వ్యాగన్ ఆర్, సెలేరియో, ఇగ్నిస్ మోడల్ కార్లలో వెనుక బ్రేక్ అసెంబ్లీ పిన్లో లోపం ఉన్నట్లు గుర్తించింది. ఈ ఏడాది ఆగస్టు మూడో తేదీ నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు తయారైన కార్లలో ఈ లోపం ఉన్నట్లు నిర్దారించినట్లు బీఎస్ఈ ఫైలింగ్లో వెల్లడించింది.
`ఈ మూడు కార్ల వెనుక బ్రేక్ అసెంబ్లీ పిన్లో లోపం ఉందని అనుమానిస్తున్నాం. కొన్నిసందర్భాల్లో బ్రేక్ పిన్ విరిగిపోయే అవకాశం ఉంది. కొన్ని కార్లలో విచిత్రమైన శబ్ధం రావచ్చు. దీర్ఘకాలంలో బ్రేక్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు` అని బీఎస్ఈ ఫైలింగ్లో మారుతి సుజుకి వివరించింది.
కస్టమర్ల భద్రతను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ముందు జాగ్రత్త చర్యగా ఈ కార్లను రీ కాల్ చేస్తున్నాం. రీకాల్ చేసిన కార్లను తనిఖీ చేసి, లోపం ఉన్న పరికరాన్ని రీప్లేస్ చేస్తాం. ఇదంతా ఉచితం అని మారుతి తెలిపింది. కంపెనీ అథరైజ్డ్ వర్క్షాపుల్లో లోపం గుర్తించిన కార్లలో విడిభాగాలను రీప్లేస్ చేస్తాం. ఈ కార్ల కొనుగోలుదారులతో సంప్రదిస్తాం అని పేర్కొంది. లోపాన్ని సరిదిద్దిన తర్వాత సదరు కార్లలో ఏదైనా మరమ్మతులు పూర్తి చేస్తామని వెల్లడించింది.