న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరోసారి ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది తొలి నెలలో అన్ని రకాల మోడళ్ళ ధరలను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఎంతమేర పెంచుతున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. ధరల పోటు, ఇటీవల తీసుకొచ్చిన రెగ్యులేటరీ నిబంధనలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొవాల్సి వస్తున్నదని, దీంతో ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది.
ఉత్పత్తి వ్యయం అధికమవడం, ఉద్గారానికి సంబంధించిన నియమాలు మరింత కట్టుదిట్టం కానుండటంతో ధరలు పెంచాల్సి వస్తున్నదని మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి(మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. కమోడిటీ ఉత్పత్తుల ధరలు ఇంకా గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయని, దీనికి తోడు ద్రవ్యోల్బణం ఒత్తిడితో ఉత్పత్తి వ్యయం అధికమవుతున్నదన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 ఉద్గారానికి సంబంధించిన నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సంస్థ వాహన ధరలను 1.3 శాతం పెంచిన విషయం తెలిసిందే. వచ్చే నెలల ఎంత మేర పెంచుతున్న విషయంపై శ్రీవాత్సవ స్పందిస్తూ..దీనిపై సంస్థ చర్చలు జరుపుతున్నదన్నారు. మరోవైపు, నవంబర్ నెలలో కంపెనీ ఉత్పత్తి 5 శాతం పెరిగి 1,52,786 యూనిట్లకు చేరుకున్నాయి.