Maruti CNG | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. నవంబర్ నుంచి మార్కెట్లోకి బాలెనో, ఎక్స్ఎల్-6 సీఎన్జీ వర్షన్ కార్లు అందుబాటులోకి తేనున్నది. ఈ రెండు మోడల్ కార్లను `ఎస్-సీఎన్జీ` ఆప్షన్లో తీసుకొస్తున్నది. వీటి ధరలు రూ.8.28 లక్షల నుంచి రూ.12.24 లక్షల మధ్య ఉంటాయని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. గతేడాది 2.3 లక్షల సీఎన్జీ వర్షన్ కార్లను విక్రయించామని, ఈ ఏడాది నాలుగు లక్షలకు పెంచాలని భావిస్తున్నట్లు పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. మారుతిసుజుకి తొలిసారి 2010లో ఎకో, ఆల్టో, వ్యాగన్ఆర్ మోడల్ కార్లను సీఎన్జీ వేరియంట్లలో మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. నాటి నుంచి ఇప్పటి వరకు 11.40 లక్షల సీఎన్జీ కార్లు విక్రయించామని శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.
ఇప్పటికే సీఎన్జీ ఆప్షన్తో బాలెనో, ఎక్స్ఎల్-6 కార్ల ఉత్పత్తి ప్రారంభించామని, నవంబర్ తొలివారంలో సేల్స్ ప్రారంభిస్తామని శశాంక్ శ్రీవాత్సవ వెల్లడించారు. బాలెనో ఎస్-సీఎన్జీ వర్షన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. డెల్టా మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎంటీ) వర్షన్ ధర రూ.8.28 లక్షలు, జెటా (ఎంటీ) వర్షన్ ధర రూ.9.21 లక్షలకు పొందొచ్చు. ఎక్స్ఎల్-6 సీఎన్జీ ఆప్షన్ కారు కేవలం జెటా (ఎంటీ) వేరియంట్లో రూ.12.24 లక్షలకు అందుబాటులోకి తెస్తున్నది.
మారుతిసుజుకి పాపులర్ హ్యాచ్బ్యాక్ మోడల్ స్విఫ్ట్ను గత ఆగస్టులో సీఎన్జీ వర్షన్లో తీసుకొచ్చింది. సీఎన్జీ వర్షన్ స్విఫ్ట్ సేల్స్ ప్రస్తుతం 14-15 శాతం ఉందని, బాలెనో సీఎన్జీకి అదే స్థాయిలో సేల్స్ ఉంటాయని మారుతి సుజుకి భావిస్తున్నది. గతేడాది 1300-1400 సీఎన్జీ ఆప్షన్ కార్లు సగటున బుకింగ్ అయితే, ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే 1400-1500 మధ్య బుకింగ్స్ నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే సీఎన్జీ కార్ల ధరలు పెరిగినా.. ఈ ఏడాది రోజుకు 1300-1400 బుకింగ్స్ నమోదవుతున్నాయని శ్రీవాత్సవ చెప్పారు.