Maruti Suzuki | వివిధ దేశాలకు కార్లు ఎగుమతి చేస్తున్న సంస్థల్లో మారుతి సుజుకి ఇండియా ముందు వరుసలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో భారత్ నుంచి విదేశాలకు కార్లు ఎగుమతి చేసిన సంస్థల్లో మారుతి తర్వాత హ్యుండాయ్ మోటార్ ఇండియా, కియా ఇండియా నిలిచాయి. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో విదేశాలకు మొత్తం 1,52,156 కార్లు ఎగుమతి అయ్యాయి.
జూన్ త్రైమాసికంలో మారుతి సుజుకి 62,857 కార్లు ఎగుమతి చేస్తే, హ్యుండాయ్ 35,100, కియా 22,511 యూనిట్లు ఎగుమతి చేశారు. హ్యుండాయ్ ప్లస్ కియా కలిసి 57,611 కార్లు ఎగుమతి చేశాయని ఇండస్ట్రీ బాడీ.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం మారుతి సుజుకి దాదాపు 10 దేశాలకు 17 మోడల్ కార్లు ఎగుమతి చేస్తున్నది. లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా ఖండ దేశాలకు కార్లు ఎగుమతి చేస్తున్నది. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన ఫ్రాంక్స్తోపాటు స్విఫ్ట్, బాలెనో, డిజైర్, బ్రెజా, గ్రాండ్ విటారా తదితర మోడల్స్ ఎగుమతి చేస్తోంది. 2021-22లో 2,35,670, 2022-23లో 2,55,439 యూనిట్లు ఎగుమతి చేసింది.
దేశం నుంచి కార్లు ఎగుమతి చేస్తున్న సంస్థల్లో ఫోక్స్ వ్యాగన్ ఇండియా నాలుగో స్థానంలో నిలుస్తుంది. తొలి త్రైమాసికంలో 7,433 యూనిట్లు ఎగుమతి చేస్తే, నిసాన్ ఇండియా 5,928 కార్లు ఎగుమతి చేసింది. ఇతర కార్ల కంపెనీలు కలిసి 18,327 యూనిట్లు సమిష్టిగా ఎగుమతి చేశాయి.
మారుతి సుజుకి ఇండియా – 62,857
హ్యుండాయ్ మోటార్ ఇండియా -35,100
కియా ఇండియా – 22,511
ఫోక్స్ వ్యాగన్ ఇండియా – 7,433
నిసాన్ ఇండియా – 5,298
ఇతర కార్ల కంపెనీలు – 18,327
మొత్తం ఎగుమతి చేసిన కార్లు – 1,52,156