న్యూఢిల్లీ, జూన్ 30: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ..కాంప్యాక్ట్ ఎస్యూవీ బ్రెజ్జాలో నయా వెర్షన్ను మార్కెట్కు పరిచయం చేసింది. రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో ఈ కారు లభించనున్నది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన ఈ మోడల్ రూ.7.99 లక్షల నుంచి రూ.13.96 లక్షల మధ్యలో లభించనున్నది. ఎస్యూవీ సెగ్మెంట్ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ నూతన మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు కంపెనీ ఎండీ, సీఈవో హిసాషి టకెచీ తెలిపారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఆరో వాహనాలను విడుదల చేసినట్లు, దేశీయ మార్కెట్పై తమకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శణమని ఆయన పేర్కొన్నారు. అటు డిజైన్, టెక్నాలజీ, నూతన ఫీచర్స్తో వాహన రూపకల్పన చేస్తున్నట్లు, కొనుగోలుదారులు కోరుకుంటున్న విధంగా కంఫర్ట్గా ఉండేటట్టు డిజైన్ చేస్తున్నట్లు చెప్పారు. 2016లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన బ్రెజ్జా..ఇప్పటి వరకు 7.5 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో తయారైన ఈ మోడల్ లీటర్కు 20.15 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. మాన్యువల్, ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, 360 డిగ్రీల్లో కెమెరా, 40 కనెక్టెడ్ ఫీచర్స్, ఆరు ఎయిర్బ్యాగ్లు ఉన్నాయి. హ్యుందాయ్కి చెందిన వెన్యూ, కియాకు చెందిన సోనెట్లకు పోటీగా సంస్థ ఈ నూతన మోడల్ను పరిచయం చేసింది.