హైదరాబాద్, జూలై 10: జేసీ బ్రదర్స్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దుస్తులను విక్రయిస్తున్న మర్రి రిటైల్స్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకోగా..శుక్రవారం అనుమతినిచ్చింది. తాజా షేర్లను జారీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.522 కోట్ల నిధులను సేకరించాలని సంకల్పించింది. ఇందుకోసం కంపెనీ ప్రమోటర్ మర్రి వెంకట్ రెడ్డికి సంబంధించిన 2.7 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించనున్నారు.
ఈ వాటాల విక్రయం ద్వారా సమీకరించనున్న నిధులను రుణాలను తీర్చడానికి, కొత్తగా 10 దుస్తుల అవుట్లెట్లు, ఒకటి ఆభరణాలు-దుస్తుల అవుట్లెట్తోపాటు మరో రెండు ఆభరణాల స్టోర్లను తెరువడానికి ఖర్చు చేయబోతున్నది. వీటితోపాటు జెట్వర్క్ మాన్యుఫ్యాక్చరింగ్, టంబో ఇమేజింగ్ ఇండియా, గుజరాత్ విక్టరీ ఫోర్జింగ్ ఐపీవోలకు కూడా సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.