దేశంలోనే కాదు..ఆసియాలోకెల్లా అపరకుబేరుడు. ప్రపంచ శ్రీమంతుల జాబితాలో చకచకా పైకి ఎగిసి ద్వితీయస్థానాన్ని అందుకున్నవాడు… ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ చాలా రిచ్. కానీ పన్నుల చెల్లింపులో చాలా పూర్.
న్యూఢిల్లీ, మార్చి 29: దేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్, షిప్పింగ్, గ్రీన్ ఎనర్జీ, మైనింగ్ ఒకటేమిటి మౌలిక సదుపాయాల రంగాలన్నింటిలోకీ శరవేగంగా విస్తరించిన గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ హిండెన్బర్గ్ నివేదిక వెలువడక ముందు రూ.22 లక్షల కోట్లను మించిపోయింది. అటువంటి గ్రూప్ దేశానికి చెల్లించే పన్నులు సైతం భారీగా ఉంటాయని ఎవరైనా భావించడం సహజమే. కానీ వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఈ రూ.22 లక్షల కోట్ల గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ 2022లో చెల్లించిన కార్పొరేట్ పన్ను రూ.480 కోట్లు మాత్రమే. దేశంలో టాప్ కార్పొరేట్ ట్యాక్స్పేయర్ టీసీఎస్ ఇదే ఏడాది రూ.11,000 కోట్లకుపైగా పన్ను చెల్లించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ కనీసం టాప్-10 ట్యాక్స్ పేయర్ల జాబితాలో కూడా లేదు.
కంపెనీలు ఆర్జించే లాభాల్లోంచి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేట్ పన్నును 2019లో కేంద్ర ప్రభుత్వం 35 శాతం నుంచి 30 శాతానికి తగ్గించింది. తయారీ, ఇన్ఫ్రా రంగాల్లో ఉన్న పలు సంస్థలు వివిధ రాయితీలను చూపించుకుని, అంతకంటే తక్కువ పన్నునే కడుతుంటాయి. ఇందులో మరింత కనిష్ఠ పన్ను చెల్లింపుతోనే అదానీ ఎంటర్ప్రైజెస్ సరిపెడుతున్నది. ఎందుకంటే తక్కువ లాభాల్నే ఆ కంపెనీ చూపిస్తున్నది. ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరహాలో భారీ లాభాల్ని సంపాదించకపోయినా, మార్కెట్ విలువను చూపించి దేశంలో టాప్ కార్పొరేట్గా అదానీ చెలామణీ అయిపోతున్నది. ఎన్నెన్నో కంపెనీలను, ప్రాజెక్టుల్ని చేజిక్కించుకుంటున్నది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.61,000 కోట్లు, ఎస్బీఐ రూ.35,500 కోట్ల చొప్పున నికరలాభాన్ని ఆర్జించాయి. ఇదే సమయంలో అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం రూ.780 కోట్లే.
హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.9 లక్షల కోట్లలోపునకు తగ్గింది. అయినప్పటికీ, దేశంలో ఇప్పుడిది టాప్ 5 మార్కెట్ విలువకలిగిన గ్రూప్ల్లో ఒకటిగా ఉన్నది. కానీ లాభాలు, వాటిపై చెల్లించే పన్నులు మాత్రం పాతాళంలో ఉన్నాయి. లాభాలతో పోలిస్తే అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు విలువ చాలా ఎక్కువంటూ వాల్యుయేషన్ గురుగా పేరొందిన న్యూయార్క్ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అశ్వథ్ దామోదరన్ ఇటీవల వివరించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ ఫండమెంటల్స్ ప్రకారం రూ.945 మాత్రమే సరైన ధరగా ఆయన తెలిపారు. కానీ ఆ షేరు ధర ప్రస్తుతం రూ. 1,800 సమీపంలో ట్రేడవుతున్నది.
అదానీ గ్రూప్ స్వయంగా మోసపూరిత విధానాలతో షేర్ల ధరలను పెంచుకోకపోయినా, సరళంగా ఉన్న స్టాక్ ఎక్ఛేంజీల లిస్టింగ్ నిబంధనలను, దగ్గరి సంస్థల లావాదేవీలను అదానీ ఉపయోగించుకోవడంతో షేర్ల ధరలు కృత్రిమంగా పెరిగిపోయాయని, గ్రూప్ తన పరపతిని పెంచుకుందని విశ్వసిస్తున్నట్టు దామోదరన్ వివరించారు. తాజా ఈక్విటీ మూలధనం, రుణాల సమీకరణకు పెరిగిన మార్కెట్ విలువ తోడ్పడిందన్నారు. అదానీ గ్రూప్ పలు మార్కెట్, అకౌంటింగ్ మోసాలతో షేరు విలువల్ని కృత్రిమంగా పెంచుకుందంటూ అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ తీవ్రంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ చెల్లించిన పన్నులతో పోల్చినా, ఆ కంపెనీల మార్కెట్ విలువ ప్రస్తుతం కూడా కృత్రిమస్థాయిలోనే ఉన్నదని విశ్లేషకులు వాదిస్తున్నారు.
రెండు అదానీ గ్రూప్ కంపెనీలు అధిక రిస్క్లో ఉన్నాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. గ్రూప్ మాతృసంస్థ, ఇతర కంపెనీల్లో పారదర్శకత బలహీనంగా ఉన్న నేపథ్యంలో అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పోర్ట్స్ ఆర్థిక సామర్థ్యాన్ని దెబ్బతీసేలా రిస్క్లు వ్యాపిస్తాయని తీవ్ర హెచ్చరిక జారీచేసింది.
షేర్లు తనఖా పెట్టి తమ ప్రమోటర్లు తీసుకున్న 2.15 బిలియన్ డాలర్ల రుణాలన్నీ చెల్లించివేశామని, ఆయా నిర్వహణా కంపెనీల అప్పులు మాత్రమే మిగిలి ఉన్నాయని అదానీ గ్రూప్ వివరించింది. షేర్ల తనఖా రుణాలను పూర్తిగా చెల్లించలేదంటూ వచ్చిన వార్తలపై స్టాక్ ఎక్సేంజీలకు కోరిన మేరకు వివరణ ఇస్తూ అదానీ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. తనఖా చేసిన షేర్లను బ్యాంక్లు విడుదల చేశాయని తెలిపింది.