Stocks New Record | దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డు నెలకొల్పాయి. సోమవారం ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 765 పాయింట్లు లబ్ధి పొంది 56,958 పాయింట్లతో ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 226 పాయింట్లు బలపడి 16,931 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంతకుముందు సెన్సెక్స్ 56,329, నిఫ్టీ 16,775 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది.
డాలర్పై రూపాయి బలోపేతం కావడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు.. దేశీయ మార్కెట్లోకి రూ.1.28 లక్షల కోట్ల ఎఫ్డీఐల రాక, వ్యాక్సినేషన్తో ఇన్వెస్టర్లలో తగ్గిన కరోనా మహమ్మారి భయం, జీడీపీ, ఆటో సేల్స్ పెరుగుతాయన్న అంచనాల మధ్య సూచీలు దూసుకెళ్లాయి.
ఫారెక్స్ నిల్వలు నిరంతరం పెరుగుతుండగా, మార్కెట్లోకి నిధుల వరద పోటెత్తింది. బీఎస్ఈ-30 ఇండెక్స్లో 26 స్టాక్స్ లాభపడగా, నాలుగు స్క్రిప్ట్లు నష్టపోయాయి. భారతీ ఎయిర్టెల్ స్క్రిప్ట్ 5.19 శాతం లాభపడి 624.75 వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్ 4 శాతం లబ్ధి పొందింది. నెస్ట్లే ఇండియా 1.10 శాతం నష్టపోయింది.
బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.247.34 లక్షల కోట్లు దాటింది. బీఎస్ఈ-30 ఇండెక్స్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. బీఎస్ఈలోని 3497 షేర్లలో 2,215 స్క్రిప్ట్లు లబ్ధి పొందగా, 1096 షేర్లు నష్టపోయాయి.
బీఎస్ఈలో 435 స్క్రిప్ట్లు అప్పర్ సర్క్యూట్ను తాకాయి. 211 షేర్లు 52 వారాల గరిష్ఠాన్ని తాకగా, 32 స్క్రిప్టులు 52 వారాల కనిష్టాన్ని తాకాయి. ఇక నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ మినహా అన్ని ఇండెక్స్లు లాభాలు గడించాయి. నిఫ్టీలో అత్యధికంగా భారతీ ఎయిర్టెల్ 5.02 శాతం లాభ పడింది.