హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ): వినియోగదారుల్లో కొనుగోలు విధానం మారుతున్నదని, అందుకు అనుగుణంగా రిటైల్ వ్యాపారంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని పలువురు పారిశ్రామిక నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొవాలంటే రిటైల్ వ్యాపారులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ఇక 2025 నాటికి దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు రిటైల్ 4.0 రంగం కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అమేజాన్ ఇండియా సంయుక్తంగా రిటైల్ రంగంలో రావాల్సిన మార్పులు అనే అంశంపై శుక్రవారం హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ఆన్లైన్ విక్రయాల్లో చిన్న చిన్న వ్యాపారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆన్లైన్ విక్రయాన్ని మరింత సులభతరం చేయాలని, ఇందుకు అమేజాన్, ఎఫ్టీసీసీఐ వంటి సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన 500 మంది చిన్న వ్యాపారులకు శిక్షణ ఇచ్చిన అమేజాన్ సంస్థను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఇక అమెజాన్ ఇండియా పబ్లిక్ పాలసీ విభాగం అధిపతి ఉదయ్ సింగ్ మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో అమెజాన్ స్థానిక దుకాణాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా పలు సమస్యలను పరిష్కారం లభించిందన్నారు. ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ… నాలుగవ పారిశ్రామిక విప్లవం (4.0) కొనుగోలుదారులకు మరింత సులభతరమైన సేవల్ని అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు.