హైదరాబాద్, ఆగస్టు 24: అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న పర్సనల్కేర్ ఉత్పత్తుల విక్రయ సంస్థ మామఎర్త్… హైదరాబాద్లో పరిశోధన కేంద్రం (ఆర్అండ్డీ) ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. నగరంలో ఏర్పాటు చేసిన తన తొలి ఫ్లాగ్షిప్ స్టోర్ను హోనాసా కన్జ్యూమర్ లిమిటెడ్ కో-ఫౌండర్, చీఫ్ ఇన్నోవేషన్ అధికారి ఘజాల్ అలఘ్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్లో పరిశోధన కేంద్రం(ఆర్అండ్డీ) ప్రారంభించాలనుకుంటున్నట్లు, వినియోగదారులు అభిరుచులకు తగ్గట్టుగా ఉత్పత్తులను రూపొందించడానికి ఈ సెంటర్ను నెలకొల్పాలనుకుంటున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం సంస్థకు హర్యాన, ముంబైలలో ఉత్పత్తి ప్లాంట్లతోపాటు పరిశోధన కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. వ్యాపార విస్తరణలో భాగంగా తెలంగాణలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు, ఇక్కడ భవిష్యత్తులో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉన్నదన్నారు. 504 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో 350 రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. గడిచిన ఆర్థికసంవత్సరంలో సంస్థ వెయ్యి కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా 85కి పైగా ఫ్లాగ్షిప్ స్టోర్లలో స్కిన్కేర్, హెయిర్కేర్, పర్సనల్ కేర్, కలర్ కేర్ ఉత్పత్తులను విక్రయిస్తున్నది.
మూడు నెలల్లో ఐపీవోకి..
వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో ఐపీవోకి రాబోతున్నట్లు ఆమె ప్రకటించారు. రూ.400 కోట్ల విలువైన షేర్లను విక్రయించడంతోపాటు ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన 4.68 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించబోతున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ధరఖాస్తు చేసుకోగా, అనుమతి కూడా లభించిందన్నారు. మరోవైపు భారీ స్థాయిలో నిధులను సేకరించడానికి సిద్ధమైంది. 150 మిలియన్ డాలర్ల నిధుల సేకరణకు సంబంధించి ఫిడిలిటీ, జీఐసీ, క్యూఐఏ, సాఫ్ట్బ్యాంక్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. ఐపీవో కంటే ముందే ఈ నిధులను సేకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. కంపెనీ మొత్తం విక్రయాల్లో ఆన్లైన్ వాటా 60 శాతం ఉండగా, ఆఫ్లైన్ వాటా 40 శాతంగా ఉన్నదన్నారు.