న్యూఢిల్లీ, డిసెంబర్ 31: పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణరాజు కంపెనీ ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంక్లు కోరుతున్నట్టు.. ఈ కంపెనీ దివాలా ప్రక్రియకు ఎన్సీఎల్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాలివి… ఇండ్ భారత్ థర్మల్ రూ. 1,383 కోట్ల రుణాన్ని బ్యాంక్లకు చెల్లించాల్సి ఉండగా, చాలాకాలంగా బకాయిలు చెల్లించడం లేదు. కంపెనీ తనఖా చేసిన ఆస్తుల విలువ రూ. 872 కోట్లే ఉంది. దీంతో ఈ కంపెనీ దివాలా తీసిందని, ఈ కారణంగా దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. కంపెనీపై బ్యాంకులు డిమాండ్ చేస్తున్న దివాలా ప్రక్రియను అనుమతించవద్దంటూ ఇండ్ భారత్ థర్మల్ చేసిన వాదనల్ని ఎన్సీఎల్టీ తిరస్కరించింది. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి రిజల్యూషన్ అధికారిని నియమించింది. మూడు రోజుల్లో కంపెనీని స్వాధీనపర్చుకోవాలని, పరిష్కార ప్రక్రియ గడువుతో సహా వివరాలన్నీ తెలియచేయాలని, ఈ మేరకు ఫారం-2ను దాఖలు చేయాలని ఆ అధికారిని ఆదేశించింది.