ముంబై, అక్టోబర్ 4: ఎస్బీఐ ఖాతాదారులకు గొప్ప ఊరట లభించింది. నగదు ఉపసంహరణతోసహా మరో 4 రకాల కీలక సేవలను కస్టమర్లు ఇక తమ ఇండ్ల వద్దే పొందే వెసులుబాటు దొరికింది. బ్యాంకింగ్ రంగాన్ని పెరుగుతున్న డిజిటలైజేషన్ కొత్త పుంతలు తొక్కిస్తున్నది మరి. నూతన సాంకేతిక పరిజ్ఞానం బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేస్తున్నది. బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. ‘మొబైల్ హ్యాండ్హెల్డ్ డివైజ్’ సర్వీస్ను ప్రారంభించింది. ఈ డివైజ్ను బ్యాంక్ చైర్మన్ దినేశ్ ఖారా ఆవిష్కరించగా, ఇది ఐదు ప్రధాన బ్యాంకింగ్ సేవలను కస్టమర్లకు అందిస్తుంది. నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్, నగదు బదిలీ, బ్యాలెన్స్ విచారణ, మిని స్టేట్మెంట్ సేవలను ఎస్బీఐ ఖాతాదారులు ఈ డివైజ్ రాకతో ఇంటి నుంచే పొందగలరని ఖారా ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ప్రస్తుతం ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయిం ట్ల (సీఎస్పీ) వద్ద జరుగుతున్న మొత్తం లావాదేవీల్లో 75 శాతం ఈ ఐదు సేవలకు సంబంధించినవే కావడం గమనార్హం.
మొబైల్ హ్యాండ్హెల్డ్ డివైజ్ను బ్యాంకింగ్ రంగంలో ఓ విప్లవాత్మక మార్పుగా ఎస్బీఐ అభివర్ణిస్తున్నది. ఖాతాదారుల ఇంటి వద్దకే ఇది నేరుగా కియోస్క్ బ్యాంకింగ్ సర్వీస్ను తీసుకెళ్తుందని చెప్తున్నది. అంతేగాక కస్టమర్ సర్వీస్ పాయింట్స్ (సీఎస్పీ) ఏజెంట్ల పనిని ఈ డివైజ్ ఎంతో సులభతరం కూడా చేయనున్నది. సీఎస్పీ ఏజెంట్లు ఈ డివైజ్తో ఖాతాదారుల ఇండ్ల వద్దకు వెళ్లి నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్, నగదు బదిలీ తదితర సేవలను అందించనున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది.
వీలైనంత త్వరలో ఈ మొబైల్ హ్యాండ్హెల్డ్ డివైజ్ ద్వారా కస్టమర్లకు మరిన్ని సేవల్ని అందించాలని ఎస్బీఐ యోచిస్తున్నదిప్పుడు. చేతిలో పట్టుకుని కస్టమర్లు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి వారికి బ్యాంకింగ్ సేవల్ని అందించడానికి అనువుగా ఉండే ఈ డివైజ్ నుంచి భవిష్యత్తులో సామాజిక భద్రత పథకాల్లో ఎన్రోల్మెంట్, అకౌంట్ ఓపెనింగ్, రెమిటెన్స్, కార్డ్ ఆధారిత సేవలు వచ్చేలా చూడాలనుకుంటున్నది. ఇదే జరిగితే బ్యాంకుల వద్ద రద్దీ చాలావరకు తగ్గిపోతుందని, బ్యాంకింగ్ సేవలూ అందరికి చేరువవుతాయన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.