Mahindra XUV400 | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎక్స్యూవీతోపాటు ఐదు ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లను మార్కెట్లోకి తేనున్నట్లు ప్రకటించింది మహీంద్రా అండ్ మహీంద్రా.. తాజాగా ఎక్స్యూవీ 400 మోడల్ కారును మార్కెట్లోకి వచ్చేనెల ఆరో తేదీన ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. దేశంలో ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీ.. టాటా మోటార్స్ వారి నెక్సాన్ ఈవీకి మహీంద్రా ఎక్స్యూవీ 400 గట్టి పోటీ ఇవ్వనున్నదని చెబుతున్నారు. అయితే ఎక్స్యూవీ 400 కార్ల డెలివరీ మాత్రం అక్టోబర్లో మొదలు కానున్నట్లు సమాచారం. ఈ కారును 2020 ఆటో ఎక్స్పోలో మహీంద్రా ప్రదర్శించింది.
మహీంద్రా ఎక్స్యూవీ 400 కారు 150 హెచ్పీ ఇంధనం వెలువరించే ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్, రెండు బ్యాటరీల ప్యాక్తో రానున్నదని తెలుస్తున్నది. ఎక్స్యూవీ 700 మదిరిగా క్యాబిన్ లోపల అడ్రెనో ఎక్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అడాస్ తదితర ఫీచర్లు జత కలుస్తాయని సమాచారం. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 350 నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఎక్స్యూవీ 300 కంటే పొడవుగా ఉంటుంది ఎక్స్యూవీ 400 ఈవీ కారు.