Mahindra 5-Door Thar | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన 5-డోర్ వర్షన్ థార్ కారును మార్కెట్లో ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 5-డోర్ థార్ కారును ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. ప్రస్తుత త్రీ-డోర్ థార్ ఎస్యూవీతోనే 5-డోర్ థార్ విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో మనాలీలో 5-డోర్ థార్ కారును ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఎక్స్టీరియర్గా 5-డోర్ థార్ కారు రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్లె, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ హెడ్ లైట్స్, డీఆర్ఎల్స్, న్యూ అల్లాయ్ వీల్స్, రీ డిజైన్డ్ టెయిల్ లైట్స్ తోపాటు పలు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది.
ఇంటీరియర్గా రీ డిజైన్డ్ డాష్ బోర్డ్ విత్ డ్యుయల్ టోన్ థీమ్, లార్జర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ రో ఆర్మ్ రెస్ట్స్, లెదర్ రాప్డ్ స్టీరింగ్ వీల్ విత్ మౌంటెడ్ కంట్రోల్స్, సర్క్యులర్ ఏసీ వెంట్స్ తదితర ఫీచర్లు ఉంటాయి.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న త్రీ డోర్ థార్ కారులో వాడుతున్న ఇంజిన్నే 5-డోర్ థార్ కారులోనూ వాడతారని తెలుస్తున్నది. 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ లేదా 2.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ గానీ వాడే చాన్స్ ఉంది. డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 130 బీహెచ్పీ విద్యుత్, 300 ఎన్ఎం టార్క్, టర్బో పెట్రోల్ ఇంజిన్ 152 బీహెచ్పీ విద్యుత్, 320 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి.
మార్కెట్లో ఆవిష్కరించిన తర్వాత ప్రస్తుత త్రీ డోర్ థార్, మహీంద్రా ఎక్స్యూవీ 700 మధ్య మహీంద్రా 5-డోర్ థార్ నిలుస్తుందని భావిస్తున్నారు. 5-డోర్ థార్ కారు ధర రూ. 15 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.22 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు పలుకుతుందని భావిస్తున్నారు.