న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: మహీంద్రా అండ్ మహీంద్రా మళ్లీ వాహన ధరలను పెంచింది. అన్ని మోడళ్ళ ధరలను 2.5 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో రూ.10 వేల నుంచి రూ.63 వేల వరకు ప్రియం కానున్నాయి. పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. కీలక కమోడిటీ ఉత్పత్తులైన స్టీల్, అల్యుమినియం, పల్లాడియం ధరలు భారీగా పెరగడం వల్లనే వాహన ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన నెల రోజుల్లో పెరిగిన ముడి సరుకుల ధరల ప్రభావాన్ని తగ్గించడంలో భాగంగా వాహన ధరలను స్వల్పంగా పెంచినట్లు తెలిపింది. అంతకుముందు కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ అన్ని మోడళ్ళ ధరలను పెంచిన విషయం తెలిసిందే.