హైదరాబాద్, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ బిజినెస్): లాజిస్టిక్ సేవల్లో దేశంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన మహీంద్రా లాజిస్టిక్..రాష్ట్రంలో మరో గోదాంను ప్రారంభించింది. సిద్దిపేట జిల్లాలోని ములుగు వద్ద ఏర్పాటు చేసిన అరుణ ఇండస్ట్రియల్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ గోదాంను కంపెనీ ఎండీ, సీఈవో రామ్ప్రవీణ్ స్వామినాథన్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…తెలంగాణలో సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడంలో భాగంగా ఈ సరికొత్త గోదాంను ప్రారంభించినట్లు, ప్రస్తుతం ఈ గోదాంలో 470 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
వచ్చే పండుగ సీజన్ నాటికి ఈ సంఖ్యను 1,200కి పెంచుకోనున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ ఉద్యోగుల్లో 70 శాతం మంది స్థానికులు ఉన్నారని, అలాగే 23 శాతం మహిళ ఉద్యోగులు ఉండటం విశేషమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోదాంల్లో 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ-కామర్స్ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఈ సెంటర్ను నెలకొల్పినట్లు, దీంతో కస్టమర్లకు మరింత వేగవంతంగా సరుకు సరఫరా చేయడానికి వీలు పడుతున్నదన్నారు. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా 250 సెంటర్లు ద్వి, తృతీయ శ్రేణి నగరాల్లో నెలకొల్పింది. తెలంగాణ మార్కెట్ తమకు చాలా కీలకమని, ఇక్కడి మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించడంలో భాగంగా భారీగా గోదాంలను విస్తరించినట్లు చెప్పారు.