ముంబై, జనవరి 17: మహీంద్రా ట్రక్కులకు మహీంద్రా గ్రూప్ ఒక కొత్త గ్యారంటీ స్కీమ్ను ప్రకటించింది. తమ బీఎస్-4 ట్రక్ల శ్రేణికి వర్తింపచేస్తూ ‘మరింత మైలేజీ పొందండి లేదా ట్రక్లను వెనక్కు తీసుకుంటాం’ అంటూ ఒక మైలేజీ గ్యారం టీ పథకాన్ని మహీం ద్రా గ్రూప్ ట్రక్ బస్ డివిజన్ (ఎంటీబీ) వెల్లడించింది. హెచ్సీవీ బ్లాజో ఎక్స్, ఐవీసీ ఫ్యురియో, ఎల్సీవీల శ్రేణి ఫ్యురియో 7, జాయో వాహనాలకు ఇది వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఇంధన ధరలు పెరుగుతున్న తరుణంలో వినియోగదారుకు విలువ చేకూర్చేందుకు ఈ స్కీమ్ను ప్రవేశపెట్టామని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజే నక్రా చెప్పారు. ఇటువంటి పథకాన్ని 2016లో తొలుత తమ హెచ్సీవీ ట్రక్ బ్లాజో వాహనానికి ప్రవేశపెట్టామని, ఒక్క వాహనం కూడా వెనక్కు రాలేదని కంపెనీ వెల్లడించింది. తదుపరి తాము విడుదల చేసిన బ్లాజో ఎక్స్, ఫ్యురియో ఐసీవీ శ్రేణి, ఫ్యురియో 7లు అధిక ఇంధన సామర్థ్యాన్ని కనపరుస్తున్నాయని కంపెనీ బిజినెస్ హెడ్ జలజ్ గుప్తా తెలిపారు.