Madhabi Puri Buch | స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) చైర్మన్గా మాధవి పూరి బచ్ నియామకం అయ్యారు. సెబీకి ఓ మహిళ చైర్మన్గా నియామకం కావడం ఇదే తొలిసారి. మాధవి గతంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ హెడ్గా సేవలందించారు. 2017 నుంచి 2021 మధ్య కాలంలో సెబీ పూర్తి స్థాయి మెంబర్గా పని చేశారు. ప్రస్తుతం ఉన్న సెబీ చైర్మన్ అజయ్త్యాగి పదవీ కాలం నేటితో ముగిసింది. దీంతో మాధవిని ప్రభుత్వం నియమించింది.
అజయ్ త్యాగి 1984 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందిన వ్యక్తి. ఆయన 2017, మార్చి 1న సెబీ చైర్మన్గా నియామకం అయ్యారు. 2017లో మూడేండ్ల పదవీ కాలానికి సెబీ చైర్మన్గా నియామకమైన అజయ్ త్యాగి.. కరోనా నేపథ్యంలో 2020 ఫిబ్రవరిలో తొలుత ఆరు నెలలు, ఆగస్టులో 18 నెలల పొడిగింపు ఇచ్చారు.
గతేడాది అక్టోబర్ 28న నూతన చైర్మన్ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. అనంతరం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ను ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్స్ సెర్చ్ కమిటీ (FSRASC) విడుదల చేసింది. ఈ జాబితాలో ఉన్నవారికి ఇంటర్వ్యూలు నిర్వహించింది.
ఈ పదవి కోసం ఆర్థిక సేవల మాజీ కార్యదర్శి దేబాశిష్ పాండా, ప్రస్తుత రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థికశాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్, ఐఎఫ్ఎస్సీ అథారిటీ చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్తో పాటు మాధవి పూరి బచ్ పోటీ పడ్డారు. చివరకు మాధవినే సెబీ చైర్మన్ పదవి వరించింది.