హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ బిజినెస్ బ్యూరో): యూఏఈ ఆధారిత గ్లోబల్ కంపెనీ లులు గ్రూప్.. తెలంగాణలో భారీగా పెట్టుబడులను ప్రకటించింది. రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, రిటైల్ ఔట్లెట్స్ రంగాల్లో రూ.3,500 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సోమవారం ఇక్కడ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ యూసుఫ్ ఆలీ స్పష్టం చేశారు. గత ఏడాది దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లులు గ్రూప్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పెట్టుబడులకు సంబంధించి వివిధ ఒప్పందాలు కుదిరిన సంగతీ విదితమే. ఈ క్రమంలోనే నాటి ఎంవోయూలను ఆచరణలో పెడుతూ లులు గ్రూప్ వివిధ ప్రాజెక్టులతో తాజాగా వచ్చేసింది. రాష్ట్రంలో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్తోపాటు, మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్టు లులు గ్రూప్ సీఎండీ యూసుఫ్ ఆలీ ప్రకటించారు.
ఇక్కడి రైతుల దగ్గర్నుంచి బియ్యాన్ని కూడా సేకరిస్తామని చెప్పారు. ఈ బియ్యాన్ని సంస్థకు చెందిన హైపర్ మార్కెట్లకు సరఫరా చేసి విక్రయించనున్నారు. ఇదిలావుంటే వచ్చే మూడేండ్లకుపైగా కాలంలో దేశంలో లులు గ్రూప్ రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. ప్రస్తుతం జరుగుతున్న, కొత్త ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రకటించింది. అయితే ఈ పెట్టుబడుల్లో ఒక్క తెలంగాణకు ప్రకటించినవే రూ.3,500 కోట్లు కావడం గమనార్హం. ఇప్పటికే భారత్లో రూ.20,000 కోట్లకుపైగా పెట్టుబడుల్ని పెట్టిన కంపెనీ.. 22వేలకుపైగా ఉద్యోగాల్ని కల్పించింది. మొత్తం 50వేల ఉద్యోగాల్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు లులు చెప్తున్నది. దేశీయంగా హైదరాబాద్, కొచ్చి, తిరువనంతపురం, బెంగళూరు, లక్నో, కోయంబత్తూర్లలో షాపింగ్ మాల్స్, హోటల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కార్యకలాపాలను సంస్థ చేస్తున్నది విదితమే.
రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.500 కోట్ల పెట్టుబడిలో భాగంగా తొలి ప్రాజెక్టు కింద హైదరాబాద్లోని కూకట్పల్లిలో 5 లక్షల చదరపు అడుగుల్లో లులు మాల్ వస్తున్నది. ఇంతకుముందున్న మంజీరా మాల్నే రూ.300 కోట్ల పెట్టుబడితో రీ-బ్రాండ్ చేస్తున్నారు. ఈ ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ తొలి వారంలో దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సంస్థ సీఎండీ యూసుఫ్ ఆలీ చెప్పారు.
రాష్ట్రంలో మరిన్ని మాల్స్ కూడా వస్తాయని, ఇందులో రూ.2,000 కోట్ల పెట్టుబడితో స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ డెస్టినేషన్ మాల్ను ఏకంగా 22 లక్షల చదరపు అడుగుల్లో తెస్తున్నామని ఆలీ తెలిపారు. హైదరాబాద్లో తెచ్చే ఈ హైపర్ మార్కెట్తో 2వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వెల్లడించారు. ఇందులో 5 సినిమా హాల్స్ ఉండనున్నాయి. పిల్లలు ఆడుకునేలా ఏర్పాట్లు, ఫుడ్ కోర్టులూ ఉంటాయి. గృహోపకరణ వస్తువులు, దుస్తు లు అన్నీ లభిస్తాయి. అలాగే నగర శివార్లు, రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో రూ.1,000 కోట్లతో మినీ మాల్స్కూ కంపెనీ ప్లాన్ చేస్తున్నది. వచ్చే రెండు నెలల్లో స్థలాలను సేకరిస్తామని, 18-24 నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
హైదరాబాద్లోని చెంగిచెర్లలో లులు గ్రూప్ రూ.200 కోట్లతో ఓ అత్యాధునిక మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నది. ఈ ఇంటిగ్రేటెడ్ యూనిట్ నుంచి విదేశాలకు మాంసం ఎగుమతులు చేస్తామని కంపెనీ తెలిపింది. ప్లాంట్ ఉత్పాదక సామర్థ్యం రోజుకు 60 టన్నులు. 18 నెలల్లో ఈ ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాల్ని ప్రారంభిస్తామని లులు గ్రూప్ చెప్పింది. 2,500 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ అగ్రికల్చర్ సోర్సింగ్, లాజిస్టిక్స్ హబ్ను ఏర్పాటు చేసే యోచనలో లులు గ్రూప్ ఉన్నది. దీనిద్వారా ఎగుమతులు సులువవుతాయని సంస్థ భావిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణలో పండిన, సేకరించిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లవచ్చని సంస్థ సీఎండీ యూసుఫ్ ఆలీ చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లులు గ్రూప్నకు పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, సుగంధద్రవ్యాల ప్రాసెసింగ్ కోసం ఓ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు భూమిని కేటాయించినది తెలిసిందే.
‘తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చిత్తశుద్ధి, నిబద్ధతకు నేను ముగ్ధుడినయ్యాను. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఇన్వెస్టర్లతో ఆయన సమావేశాలు జరుపడం నేను చూశాను. ఆ కృషి వల్లే రాష్ట్రంలోకి ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలతోనూ నేను ఆకర్షితుడినయ్యాను. మాకు కొచ్చీలో ఇప్పటికే ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఉన్నది. తెలంగాణలోనూ అలాంటిదే ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించిన వెంటనే ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభిస్తాం’
-ఎంఏ యూసుఫ్ ఆలీ,
ప్రారంభం: 2000
పరిశ్రమ: బహుళ వ్యాపారాలు
ప్రధాన కేంద్రం: అబుదబీ, యూఏఈ
కార్యకలాపాలు: 42 దేశాలు
వ్యవస్థాపక సీఎండీ: ఎంఏ యూసుఫ్ ఆలీ
ఉద్యోగులు: 65వేలపైనే
వార్షిక టర్నోవర్: దాదాపు రూ.70వేల కోట్లు
2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.12 లక్షలు. ప్రస్తుతం రూ.3.17 లక్షలు. రూ.2.05 లక్షలు పెరిగింది
నాడు రాష్ట్ర జీడీపీ రూ.5.05 లక్షల కోట్లు. ఇప్పుడు రూ.13.27 లక్షల కోట్లు. 2014 నుంచి రూ.8.22 లక్షల కోట్లు పెరుగుదల
ఇన్లాండ్ ఫిషరీస్ ఉత్పత్తిలో తెలంగాణ టాప్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 370కిపైగా ఎకరాల్లో అతిపెద్ద ఆక్వా హబ్
రంగారెడ్డి జిల్లాలో రూ.300 కోట్లతో మెగా డైరీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభానికి ఏర్పాట్లు దేశంలో వరి ఉత్పత్తిలో 24వ స్థానం నుంచి అగ్రస్థానానికి తెలంగాణ. పొరుగు రాష్ర్టాల్లోనూ మన బియ్యానికి డిమాండ్
‘రాష్ట్రంలో లులు గ్రూప్ పెట్టుబడులను స్వాగతిస్తున్నాం. కంపెనీకి కావాల్సిన అన్నిరకాల సహాయ, సహకారాలను అందిస్తాం. ఇప్పటికే నిరంతర రిటైల్ ఔట్లెట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నిర్ణయం లులు గ్రూప్నకు ఎంతగానో కలిసొస్తుందని విశ్వసిస్తున్నాం. ఇక గతంలో జరిగిన ఓ సమావేశంలో లులు గ్రూప్ సీఎండీ వినయాన్ని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్గారు ఎంతో సంతోషించారు. విదేశీ సంస్థల మోజులో పడవద్దని, భారతీయ మూలాలున్న లులు గ్రూప్ను ప్రోత్సహించాలని ఆయన అన్నారు’
-కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి