Audi on Import Duties | విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రిక్ కార్లపై విధిస్తున్న అధిక సుంకాలపై జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి సంచలన వ్యాఖ్యలు చేసింది. స్థానిక మార్కెట్కు అనుగుణంగా దిగుమతి చేసుకుంటున్న న్యూ ఎలక్ట్రిక్ కార్లపై ప్రయోగాత్మకంగా సుంకాల తగ్గించాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం సమగ్ర విద్యుత్ వాహనాల విధానం రూపకల్పనకు ప్రణాళిక రూపొందిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఫోక్స్ వ్యాగన్ అనుబంధ ‘ఆడి’ ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది. విదేశీ ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల దేశీయంగా సదరు కంపెనీలు గణనీయ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించినట్లవుతుందని వ్యాఖ్యానించింది ఆడి.
‘కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించడానికి కంపెనీలకు మూడు నుంచి ఐదేండ్ల పాటు విండో కల్పిస్తే, దేశీయంగా ధరల కోణంలో మేం ప్రయోగాత్మకంగా భారత్ మార్కెట్లో కొత్త మోడల్స్ తయారీకి ప్రయత్నించే అవకాశం ఉంటుంది’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు.
దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల అసెంబ్లింగ్ కోసం ఆడి కారు యాజమాన్యం ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ అంశంపై తమ పేరెంట్ సంస్థ ఫోక్స్ వ్యాగన్తో చర్చిస్తున్నట్లు సమాచారం. దేశీయంగా ఐసీఈ కార్లను మాత్రమే ప్రస్తుతం అసెంబ్లింగ్ చేస్తున్నది.
ప్రస్తుతం ఆడి ఇండియా.. పాత తరం ఈ-ట్రాన్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్ల స్థానే.. కొత్తగా క్యూ8 ఈ-ట్రాన్ ఎస్ యూవీ అండ్ స్పోర్ట్ బ్యాక్ కార్లను ఆవిష్కరించింది. క్యూ8 ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారు ధర రూ.1.14 కోట్ల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమైంది. సింగిల్ చార్జింగ్తో 600 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
ఇంతకుముందు యూఎస్ కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సైతం.. దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రిక్ కార్లపై సుంకాలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ, స్థానికంగా ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తేనే సుంకాలు తగ్గించలేమని టెస్లా యాజమాన్యానికి కేంద్రం తెగేసి చెప్పింది.