న్యూఢిల్లీ, మార్చి 11: దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ జోరుగా సాగుతున్నది. ఈ క్రమంలోనే గడిచిన పదేండ్లలో 21 రెట్లు ఎగిసి విలువపరంగా రూ.4.10 లక్షల కోట్లకు మొబైల్ ఫోన్ తయారీ చేరుతున్నట్టు ఇండియా సెల్యులార్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తాజాగా తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) వంటివి ఇండస్ట్రీకి కలిసొచ్చాయని అభిప్రాయపడింది.
ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థలు దేశీయ మొబైల్ ఫోన్ తయారీలోకి రావడం.. స్థానికంగా ఉత్పత్తిని పరుగులు పెట్టించిందని ఓ ప్రకటనలో ఐసీఈఏ పేర్కొన్నది. అలాగే మొత్తం దేశీయ మొబైల్ ఫోన్ల డిమాండ్లో 97 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) భారత్లో జరిగిన మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో 30 శాతం ఎగుమతయ్యాయని ఈ సందర్భంగా ఐసీఈఏ వివరించింది.
బడా సంస్థల హవా
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల యుగం నడుస్తున్నది. మార్కెట్లో ఎక్కడచూసినా స్మార్ట్ఫోన్ అమ్మకాలు, వాటి వినియోగదారులే మరి. ఈ క్రమంలోనే యాపిల్, సామ్సంగ్ వంటి ప్రపంచ శ్రేణి కంపెనీలూ భారత్లోకి వచ్చేశాయి. ఇక్కడ తయారుచేసి వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. దేశీయ మొబైల్ ఫోన్ ఎగుమతుల పెరుగుదలలో యాపిల్, సామ్సంగ్లది కీలకపాత్రేనని కూడా తేలింది. బ్రిటన్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఇటలీ దేశాలతోపాటు మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మార్కెట్లలోకీ భారత్లో తయారైన స్మార్ట్ఫోన్లు వెళ్తుండటం విశేషం.
ఈ నేపథ్యంలోనే దేశీయ ఎగుమతుల్లో మొబైల్ ఫోన్లు ఐదో స్థానంలో ఉన్నట్టు ఐసీఈఏ చెప్తున్నది. 2014లో దేశంలో కేవలం 2 మొబైల్ ఫోన్ తయారీ ఫ్యాక్టరీలే ఉన్నాయని, అలాంటిదిప్పుడు మొబైల్ ఫోన్ల తయారీలో భారత్.. ప్రపంచంలోనే రెండో స్థానంలోకి ఎదిగిందన్నది. ఫాక్స్కాన్, పెగట్రాన్, రైజింగ్ స్టార్, విస్ట్రన్ వంటి దిగ్గజ సంస్థలు భారత్లో ప్లాంట్లను పెట్టి మొబైల్ ఫోన్ల తయారీకి దన్నుగా నిలుస్తున్నట్టు ఐసీఈఏ తెలిపింది. నొయిడాలో సామ్సంగ్కున్న ప్లాంట్.. ఆ కంపెనీకి ప్రపంచంలోనే రెండో అతిపెద్దదని వివరించింది.
మున్ముందు మరింతగా..
ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్కు మార్కెట్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా అన్ని వస్తూత్పత్తుల వినియోగం కూడా పెరిగిపోతున్నది. దీంతో స్మార్ట్ఫోన్లకూ డిమాండ్ ఏటేటా పెరుగుతున్నది. ఇప్పటికే ఉన్న 4జీతోపాటు విస్తరిస్తున్న 5జీ సేవలతో స్మార్ట్ఫోన్ల వినియోగం ఇంకా పెరుగుతుందన్న అంచనాలు పరిశ్రమ వర్గాల్లో ఉన్నాయి. ఇక డిజిటలైజేషన్కు ప్రభుత్వాలు కూడా పెద్దపీట వేస్తుండటంతో ఇంటర్నెట్ ఆధారిత స్మార్ట్ఫోన్ల వాడకం అందరికీ అనివార్యమైపోయిందని పరిశీలకులు అంటున్నారు.
ఆన్లైన్ మార్కెటింగ్, ఓటీటీల వంటివీ స్మార్ట్ఫోన్లకు గిరాకీ తెచ్చిపెడుతున్నాయని గుర్తుచేస్తున్నారు. అంతేగాక అప్గ్రేడ్ అవుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చాలామంది తమ ఫోన్లను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారని, ఫలితంగా మార్కెట్లో స్మార్ట్ఫోన్ల వ్యాపారం బాగా జరుగుతున్నదని మార్కెట్ నిపుణులూ చెప్తున్నారు. ఆయా సంస్థలు సైతం టెలికం కంపెనీలతో జట్టుకట్టి మార్కెట్లోకి తక్కువ ధరలకే స్మార్ట్ఫోన్లను తెస్తుండటం వీటి వాడకాన్ని మరింత పెంచేస్తున్నదని కూడా అంటున్నారు. మొత్తంగా మున్ముందు దేశంలో మొబైల్ ఫోన్ తయారీ ఇంకా పెరిగిపోవడం ఖాయమన్న అంచనాలే గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు.
2014-15లో భారత్లో మొబైల్ ఫోన్ తయారీ విలువ రూ.18,900 కోట్లుగా ఉన్నది. 2023-24లో రూ.4,10,000 కోట్లుగా ఉంటుందని అంచనా. దీన్నిబట్టి గత పదేండ్లలో 2000 శాతం పెరిగింది. 2014-15లో దేశీయ మొబైల్ ఫోన్ ఎగుమతులు కేవలం రూ.1,556 కోట్లే. ఇప్పుడది రూ.1,20,000 కోట్లుగా ఉంటుందని అంచనా. దశాబ్దకాలంలో ఎగుమతులపరంగా 7,500 శాతం వృద్ధి కనిపిస్తున్నది.
-ఐసీఈఏ