హైదరాబాద్, మార్చి 10: సీఎన్సీ మెషీన్లు, ఆటో కాంపోనెంట్ తయారీలో దేశీయ ప్రముఖ సంస్థ లోకేశ్ మెషీన్స్ లిమిటెడ్.. మేడ్చల్ వద్ద కొత్త డివిజన్ను తీసుకొచ్చింది. శుక్రవారం దీన్ని డీఆర్డీవో మాజీ చైర్మన్, భారత రక్షణ శాఖ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉన్న జీ సతీశ్రెడ్డి ప్రారంభించారు. ఈ ఉత్పాదక కేంద్రంలో రక్షణ, ఏరోస్పేస్ విడిభాగాలు తయారు కానున్నాయి. దీంతో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ (ఏఅండ్డీ) రంగంలోకి లోకేశ్ మెషీన్స్ ప్రవేశించినైట్టెంది. ఈ సందర్భంగా సంస్థ సాధించిన విజయాలను సతీశ్రెడ్డి కొనియాడారు.
భారత సైన్యం, డీఆర్డీవోకు చెందిన ఏఆర్డీఈ సహకారంతో ఈ కంపెనీ విజయవంతంగా ముందుకెళ్తున్నట్టు వివరించారు. చిన్నతరహా ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నదన్నారు. సంస్థ ఎండీ ఎం లోకేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ గ్రీన్ఫీల్డ్ ఫెసిలిటీలో తొలి దశ కింద రూ.100 కోట్లకుపైగా పెట్టుబడులు పెడుతున్నామని.. ఇక్కడ ఆయుధాలు, వాటి విడిభాగాలను తయారు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఎగుమతులు మొదలైతే పెట్టుబడులు ఇంకా పెరుగుతాయని తెలిపారు. కాగా, ఈ ప్లాంట్ చుట్టుపక్కల ఓ వెండర్ పార్కునూ సంస్థ తెస్తుండగా.. వాణిజ్య పరమైన సహకారంతో పనిచేస్తామని లోకేశ్వరరావు వెల్లడించారు.