Abroad Education | ఇప్పుడంతా డిజిటల్ మయం.. కరోనా పుణ్యమా? అని డిజిటల్.. వర్చువల్ సేవలు పెరిగాయి. ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో డిజిటలైజేషన్కు ప్రాధాన్యం పెరిగింది. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ విదేశాల్లో ప్రత్యేకించి అమెరికాలో ఉన్నత విద్యా కోర్సుల్లో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రతిదీ మనీతో ముడిపడిన నేపథ్యంలో విదేశీ విద్యాభ్యాసం అంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది.
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులు చదివే కోర్సులకు అవసరమైన ఫీజులు, వారి ఇతర ఖర్చుల కోసం తల్లిదండ్రులు పొదుపు చేసిన సొమ్ము ఖర్చు చేసేస్తారు. అదీ సరిపోకపోతే అప్పులు కూడా చేస్తారు. నగదు లేనివారు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారు. విదేశీ విద్యాభ్యాసానికి వెళ్లే విద్యార్థులకు బ్యాంకులు కూడా దండిగానే రుణాలిస్తున్నాయి. అయితే, సంబంధిత విద్యార్థుల విద్యార్హతలు, వారి తల్లిదండ్రుల ఆదాయ వనరులను బట్టి విద్యారుణాలిస్తున్నాయి బ్యాంకులు. ఆయా విద్యా రుణాలపై రుణ గ్రహీతల అర్హతలను బట్టి కేంద్రం కొన్ని రాయితీలు కల్పిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కల్పించే రాయితీలు కొత్తవి కాదు. అయినా విద్యా రుణాలపై దేశీయ విద్యా సంస్థలతోపాటు విదేశాల్లోని విద్యా సంస్థల్లో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులు ఆ రాయితీలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం అవసరం..
దేశీయంగా ప్రొఫెషనల్ కోర్సులు గానీ, టెక్నికల్ కోర్సులు గానీ అభ్యసించడానికి రూ.7.50 లక్షల రుణం పొందిన విద్యార్థులకు సెంట్రల్ సెక్టార్ వడ్డీ రాయితీ పథకం అమల్లో ఉంది. 1992 జాతీయ మైనారిటీల కమిషన్ చట్టంలోని సెక్షన్ 2 (సీ) కింద మైనారిటీలుగా ఉన్న విద్యార్థులకు పధో పరదేశ్ వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. ఇతర వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు డాక్టర్ అంబేద్కర్ సెంట్రల్ సెక్టార్ వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని తరగతుల విద్యార్థులకు విద్యా రుణాలు అందజేస్తున్నాయి. కనుక విదేశీ విద్యాభ్యాసానికి వెళ్లే విద్యార్థులు ఈ పథకాలను పరిశీలించొచ్చు.
ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం అందించడానికి 2009లో కేంద్ర మానవ వనరుల అభివ్రుద్ధి శాఖ.. సెంట్రల్ సెక్టార్ వడ్డీ రాయితీ పథకం (Central Sector Interest Subsidy Scheme) ప్రారంభించింది. భారతదేశంలోని విద్యా సంస్థల్లో టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ కోర్సులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. అంటే విదేశీ విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేసే వారికి వర్తించదన్నమాట.
దేశీయ ఉన్నత విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు తీసుకున్న రుణాలపై కొంత మేరకు పూర్తిగా వడ్డీ రాయితీ లభిస్తుంది. మారటోరియం టైమ్ లో వడ్డీ మాఫీ అవుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ లేదా పీజీ కోర్సులకు ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదివిన వారు కూడా ఈ పథకానికి అర్హులే. పూచీకత్తు గానీ, థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా రూ.7.50 లక్షల వరకు రుణాలు తీసుకున్న విద్యార్థులకు ఈ పథకం కింద రాయితీ పొందే అర్హత లభిస్తుంది. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.4.50 లక్షల్లోపే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఇతర వెనుక బడిన తరగతుల (ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) విద్యార్థులు విద్యాపరంగా పురోగతి సాధించేందుకు తోడ్పాటునిస్తుంది డాక్టర్ అంబేద్కర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ ఇంటరెస్ట్ సబ్సిడీ. విదేశీ విద్యా సంస్థల్లో పీజీతోపాటు ఎంఫిల్ లేదా పీహెచ్డీ చేసే విద్యార్థులు తీసుకున్న రుణాలపై మారటోరియం కాలంలో వడ్డీపై సబ్సిడీ లభిస్తుంది. ఈ వడ్డీ రాయితీ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఓబీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం ప్రస్తుతం అమల్లో ఉన్న క్రిమీ లేయర్ ప్రమాణాలకు లోబడి ఉండాలి. ఇక ఈబీసీ విద్యార్థులకు ఆదాయం పరిమితి రూ.2.50 లక్షల్లోపు ఉండాలి. విద్యార్థులు తమ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫైడ్ మైనారిటీ కమ్యూనిటీల్లో ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థుల కోసం 2006లో కేంద్రం ఏర్పాటు చేసిన పథకమే పధో పరదేశ్ విద్యారుణ వడ్డీ రాయితీ పథకం. వీరు విదేశాల్లో మెరుగైన ఉన్నత విద్యావకాశాలు పొందడానికి, ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకునేందుకు వడ్డీ రాయితీ ఇస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులతోపాటు ఎంఫిల్ లేదా పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులు దీనికి అర్హులు. ఒక్కసారి మాత్రమే వడ్డీ రాయితీ పొందేందుకు అర్హత ఉంది. మారటోరియం వ్యవధి ముగిసిన తర్వాత విద్యార్థులు తమ రుణ బకాయి మొత్తంపై వడ్డీ చెల్లించాలి. ఈ పథకం కింద రాయితీ పొందడానికి విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం గానీ, ఉద్యోగం చేస్తూ విద్యాభ్యాసం చేస్తున్న అభ్యర్థి వార్షిక ఆదాయం గానీ రూ.6 లక్షల్లోపు ఉండాలి.