న్యూఢిల్లీ, నవంబర్ 23: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) బుధవారం రెండు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను వెనక్కి తీసుకున్నది. జీవన్ అమర్, టెక్ టర్మ్ ప్లాన్లను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. ఇకపై ఈ రెండింటినీ అమ్మబోమని సంస్థ స్పష్టం చేసింది. అయితే ఈ బీమాల కోసం ప్రతిపాదనలు సమర్పించి, ఈ నెల 22కల్లా డిపాజిట్ సైతం చెల్లించినైట్టెతే.. ఆ ప్రతిపాదనలు 30లోగా ఆమోదం పొందినవారికి మాత్రం పాలసీలు వర్తిస్తాయని ఈ సందర్భంగా ఎల్ఐసీ ప్రకటించింది.
అలాగే ఇప్పటికే ఈ ప్లాన్లలో ఉన్నవారికీ పాలసీ నిబంధనల ప్రకారం భద్రత లభిస్తుంది. కాగా, పెరిగిన రీఇన్సూరెన్స్ రేట్లే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు గుడ్బై చెప్పేలా చేశాయి. మరోవైపు కొన్ని మార్పులు చేసి మళ్లీ వీటిని సరికొత్తగా మార్కెట్కు పరిచయం చేసే యోచనలో ఎల్ఐసీ ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక ఈ రెండు ప్లాన్లలోనూ పాలసీదారు చనిపోతే నిర్ణీత బీమా సొమ్ము మొత్తాన్ని వారి కుటుంబాలకు అందజేస్తారు. పాలసీ వ్యవధి 10 నుంచి 40 ఏండ్లదాకా ఉంటుంది. జీవన్ అమర్ ప్లాన్ రూ.25 లక్షలతో, టెక్ టర్మ్ ప్లాన్ రూ.50 లక్షలతో మొదలవుతుంది. ఆపై ఎంతవరకైనా బీమాను తీసుకోవచ్చు.